బీజేపీ ఎత్తులకు సీఎం నితీశ్ చెక్ -జేడీయూ కొత్త అధ్యక్షుడిగా ఆర్సీపీ సింగ్ -భంగపడ్డ ప్రశాంత్ కిషోర్
తనతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలను ఆగం పట్టించి, చివరికి ఉనికి లేకుండా చేయడం బీజేపీ తొలి నుంచీ అనుసరిస్తోన్న స్టైల్. ఎన్డీఏ పార్టీల మధ్య రాజకీయ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్(సీఎంపీ) లేకపోవడం అందుకు బాగా సహకరించే అంశం. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. మరోవైపు చీకటి భాగస్వామి చిరాగ్ పాశ్వాన్ ద్వారా నితీశ్ ను భారీగా దెబ్బతీయడం తెలిసిందే. తాజాగా జేడీయూకు చెందిన పలువురు ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందన్న అనుమానాల నడుమ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అనూహ్య చర్యకు దిగారు..
బిగ్బాస్-4లో నాగార్జున దరిద్రం -భార్య, కోడలితో డేటింగ్ సరేనా? -పవన్కు అంతలేదు: సీపీఐ నారాయరణ
జేడీయూ కొత్త చీఫ్ ఆర్సీపీ సింగ్
బీహార్ లో ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ, బీజేపీ బారి నుంచి తన పార్టీని కాపాడుకునేందుకు సీఎం నితీశ్ కుమార్ ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) పార్టీకి కొత్త సారధిగా ఆర్సీపీ సింగ్ను నియమించారు. ఆదివారం జరిగిన జేడీయూ జాతీయ కర్యనిర్వాహక సమావేశంలో ఈ మేరకు ఆర్సీపీ సింగ్ పేరును నితీశ్ ప్రతిపాదించగా, సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
నితీశ్కు నమ్మకస్తుడు
నితీశ్ కుమార్ కు అత్యంత నమ్మకస్తులైన ఐదుగురు నేతల్లో ఆర్సీపీ సింగ్ ప్రముఖుడు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన సింగ్.. ఒకప్పుడు నితీశ్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత జేడీయూలో చేరిన ఆయన క్రమంగా ఎదురుగుతూ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరారు. ఢిల్లీలో జేడీయూ వ్యవహారాలను చక్కబెట్టే వ్యక్తిగా, పార్టీకి సంబంధించిన వ్యూహాలను సిద్ధం చేసే నేతగా పేరుపొందిన ఆర్సీపీ సింగ్ ప్రస్తుతం రాజ్యసభలో పార్టీపక్ష నేతగానూ ఉన్నారు.
బీజేపీని నిలువరించేలా..
మూడు నెలల కిందటి వరకు బీహార్ లో అతి పెద్ద పార్టీగా కొనసాగిన జేడీయూ.. ఇటీవలి ఎన్నికల ఫలితాల్లో తీవ్రంగా నష్టపోయి.. ఎన్డీఏలో జూనియర్ భాగస్వామి స్థానానికి పడిపోయింది. 74 సీట్లతో బీజేపీ రెండో అతి పెద్ద పార్టీగా నిలవగా, 43 సీట్లతో జేడీయూ జూనియర్ పాత్రకు పరిమితమైంది. సీట్లు తక్కువైనా, ఇచ్చిన మాట ప్రకారం నితీశ్ నే సీఎంగా కొనసాగిస్తామన్న బీజేపీ వాగ్ధానం మేరకు ఏడోసారి సీఎంగా ఆయన ప్రమాణం చేశారు. అయితే తెరవెనుక జేడీయూను చీల్చేలా బీజేపీ యత్నాలు సాగిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ ప్రయత్నాలను నిలువరిస్తూ, సొంత పార్టీని కాపాడుకుని, తిరిగి పుంజుకునేలా జేడీయూకు కొత్త అధ్యక్షుడిగా ఆర్సీపీ సింగ్ ను నితీశ్ నియమించారు.
భంగపడ్డ పీకే.. జేడీయూలో ఉండుంటే..
నిజానికి పరిస్థితులు సవ్యంగా కొనసాగి ఉంటే నితీశ్ తర్వాత జేడీయూ అధ్యక్ష పీఠం ప్రశాంత్ కిషోర్ కు దక్కాల్సి ఉంది. ఎన్నికల వ్యూహకర్తగా దేశమంతటా పేరు తెచ్చుకున్న పీకే సొంత రాష్ట్రమైన బీహార్ లో జేడీయూలో(2018లో) చేరిక ద్వారా పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. ఆ సమయంలో నితీశ్.. పీకేను ఏకంగా జేడీయూ ఉపాధ్యక్షుడిగా నియమించారు. నితీశ్ కొడుకు రాజకీయాలకు దూరంగా ఉండటం, శరద్ యాదవ్ అప్పటికే దూరమైపోవడంతో ఇక జేడీయూ భవిష్యత్ నాయకుడు పీకేనే అని అంతా భావించారు. కానీ ఏడాదిన్నరలోపే.. బీజేపీకి మద్దతిచ్చే విషయంలో నితీశ్ ను విభేదించిన పీకే జేడీయూ నుంచి బహిష్కరణకు గురయ్యారు. జేడీయూలో భంగపడ్డ ప్రశాంత్ కిషోర్.. సొంతగా పొలిటిక్ పార్టీ పెడతారని వార్తలు వచ్చినా ఆ దిశగా అడుగులు వేయలేదు. గడిచిన ఏడాదిన్నరగా బీహార్ రాజకీయాలను మౌనంగా గమనిస్తున్నారు. జేడీయూ చీఫ్ గా ఆర్సీపీ సింగ్ ఎన్నికైన సందర్భంలో పార్టీ శ్రేణులు పీకేను గుర్తుచేసుకోవడం గమనార్హం.
క్రిస్మస్నాడు జగన్ పచ్చి అబద్దాలు -సీఎం స్థాయి ఇంకా పతనం -వైసీపీ ఎంపీ రఘురామ ఫైర్