నితీష్ కీలక నిర్ణయం: ఎన్డీఏలో చేరిక, జేడీయూ తనదేనంటూ శరద్ యాదవ్
న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) పార్టీ అధినేత నితీష్ కుమార్ శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే బీజేపీతో చేతులు కలిపిన నితీశ్ కుమార్.. కేంద్రంలోని అధికారిక ఎన్డీయే కూటమిలోకి చేరినట్లు ప్రకటించారు.
నితీశ్ కుమార్ నేతృత్వంలో పాట్నాలో శనివారం జరిగిన పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో.. ఈ మేరకు జేడీయూ తీర్మానం చేసింది.
దీంతో కేంద్ర మంత్రివర్గంలో జేడీయూ ఎంపీలకు చోటు దక్కేందుకు మార్గం సుగమమైంది. బీహార్లో బీజేపీ, జేడీయూ పార్టీలు దశాబ్దాలుగా కలిసే ఉన్నాయి. అయితే 2013లో జేడీయూ.. ఎన్డీఏ నుంచి విడిపోయింది. ఆ తర్వాత 2015 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిరకాల ప్రత్యర్థి అయిన ఆర్జేడీతో పొత్తుపెట్టుకుంది. వీటికి కాంగ్రెస్ కూడా తోడై మహాకూటమిగా అవతరించాయి.
ఆ ఎన్నికల్లో బీజేపీపై మహాకూటమి ఘనవిజయం సాధించింది. లాలూ ఆర్జేడీ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చినా.. నితీశ్ కుమార్నే సీఎంగా ఎన్నుకున్నారు. దీంతో లాలూ తనయులు ఇద్దరికీ నితీశ్ తన మంత్రివర్గంలో చోటిచ్చారు. అయితే ఇటీవల లాలూ, ఆయన తనయులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.దీంతో నితీశ్ సీఎం పదవికి రాజీనామా చేశారు.
అనంతరం బీజేపీతో చేతులు కలిపిన నితీశ్.. రాజీనామా చేసిన 12 గంటల్లోనే మళ్లీ సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. తాజా తీర్మానంతో నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఎన్డీయే గూటికి చేరారు నితీష్. అయితే, తాము జేడీయూ నేత శరద్ యాదవ్ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సమావేశంలో ప్రకటించారు.
ఇది ఇలా ఉండగా, జేడీయూ కీలక నేత, మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ బహిష్కృత నేతలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. జేడీయూ పార్టీ తనదేనని అన్నారు. కాగా ఇప్పటికే మహాకూటమికి మద్దతుగా ఉన్న శరద్యాదవ్.. ఆగస్టు 27న బీజేపీకి వ్యతిరేకంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నిర్వహించే ర్యాలీకి హాజరుకానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే శరద్ యాదవ్ ప్రకటన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇటీవలే జేడీయూ 21 మంది నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, బీజేపీతో చేతులు కలపడాన్ని వ్యతిరేకించిన శరద్యాదవ్ను రాజ్యసభలో జేడీయూ పక్షనేతగా తొలగించి ఆ స్థానంలో ఆర్సీపీ సింగ్ను నియమించింది.