నితీష్ ప్రమాణం, లాలూ కొడుకులు సహా మంత్రులు వీరే: పక్కనే వెంకయ్య
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ శుక్రవారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఇది ఐదోసారి. పదిహేనేళ్ల క్రితం కొద్ది రోజులే సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత 2005లో, 2010లో సీఎం అయ్యారు.
2014 లోకసభ ఎన్నికల్లో బీహార్లో పార్టీ దారుణ ఓటమి అనంతరం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మాంఝీ ముఖ్యమంత్రి అయ్యారు. మాంఝీని ముఖ్యమంత్రిగా తొలగించాక నితీష్ మరోసారి సీఎం అయ్యారు. ఇప్పుడు ఐదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
పాట్నాలోని గాంధీ మైదానంలో నితీష్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తేజస్వీ యాదవ్ ఈశ్వర్ కీ శపథ్ అంటూ ప్రమాణం చేశారు.
లాలూ రెండో తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇతను కూడా ఈశ్వరుడు అంటూ ప్రమాణం చేశారు. తేజ్ ప్రతాప్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఇబ్బంది పడ్డారు. తేజ్ ప్రతాప్ తత్తరపడుతూ ఓ పదాన్ని తప్పుగా పలికారు. గమనించిన గవర్నర్ రాంనాథ్ మళ్లీ ప్రమాణం చేయించారు. మరోసారి తప్పు దొర్లడంతో గవర్నర్ మరోసారి సర్ది చెప్పారు.
నితీష్తో పాటు లాలూ ప్రసాద్ ఇద్దరు కుమారులు... తేజస్వీ ప్రసాద్ యాదవ్, తేజ్ ప్రసాద్ యాదవ్, అబ్దుల్ వారీద్ సిద్ధిఖీ, విజయేంద్ర ప్రసాద్ యాదవ్, రాజీవ్ రంజన్ సింగ్, అశోక్ చౌదరి, చవన్ కుమార్, జయకుమార్ సింగ్, అనూప్ కుమార్ మెహతా, చంద్రికా రాయ్, అవేదేష్ సింగ్, నందన్ ప్రసాద్ వర్మ, మహేశ్వర్ హజారీ, అబ్దుల్ జలీల్ మస్తాన్, రామ్ విచార్ రాయ్, శివచంద్ర, మదన్ మోహన్ ఝా, శైలేష్ కుమార్, మంజూ వర్మ, సంతోష్ కుమార్, అబ్దుల్ గఫూర్, చంద్రశేఖర్, ఫిరోజ్ అహ్మద్, మునేశ్వర్ చౌదరి, మదన్ తానే, కపిల్ కామత్, అనిత, విజయ ప్రతాప్లకు మంత్రి పదవులు లభించాయి.
మొత్తం 28 మందితో నితీశ్ సర్కారు కొలువు తీరుతోంది. ముగ్గురు మహిళలకు పదవులు లభించాయి. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు 4:4:2 నిష్పత్తిలో మంత్రి పదవులు పంచుకునేందుకు ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ప్రమాణ స్వీకారంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ బీజేపీ లీడర్ సుశీల్ కుమార్ మోడీ,క హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ తదితరులు హాజరయ్యారు. వెంకయ్య నాయుడు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ పక్కనే కూర్చున్నారు.