నితీష్ కుమార్ సర్కారులో కొత్త డిప్యూటీ సీఎం, కేంద్రమంత్రివర్గంలోకి సుశీల్ మోడీ?
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిపై తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో బీజేపీ నుంచి సుశీల్ కుమార్ మోడీ డిప్యూటీ సీఎంగా ఉండగా, ఇప్పుడు మరొకరికి స్థానం కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ నేత తార్కిశోర్ ప్రసాద్ బీహార్ కొత్త డిప్యూటీ సీఎం అవుతారని, సుశీల్ కుమార్ మోడీ కేంద్రమంత్రివర్గంలో స్థానం దక్కించుకుంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కతిహర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తార్కిశోర్ బీహార్ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా ఇప్పటికే ఎన్నికవడం గమనార్హం.
'నాకు ఈ బాధ్యత ఇవ్వబడింది, నా సామర్థ్యం మేరకు నేను విధిని నిర్వర్తిస్తాను' అని కిశోర్ ప్రసాద్ తెలిపారు. అతను నితీష్ కుమార్ డిప్యూటీగా ఉండబోతున్నారా? అని అడిగిన ప్రశ్నకు.. 'నేను ఇప్పటికి దీనిపై వ్యాఖ్యానించలేను' వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ వెల్లడించారు.
2020 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీష్ కుమార్ చివరి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా, బీహార్లో బిజెపి శాసనసభ పార్టీ నాయకుడిగా ఉన్నా సుశీల్ మోడీ. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ బిజెపి శాసనసభ పార్టీ నాయకుడిగా ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
'బిజెపి, సంఘ్ పరివార్ నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చాలా ఇచ్చాయి. నాకు ఇవ్వాల్సిన బాధ్యతను నేను నిర్వర్తిస్తాను. పార్టీ కార్యకర్త పదవిని ఎవరూ తొలగించలేరు' అని ఆయన ట్విట్టర్లో రాశారు. బిజెపి శాసనసభ పార్టీ డిప్యూటీ లీడర్గా ఎన్నికైన బెట్టియా ఎమ్మెల్యే రేణు దేవిని ఆయన అభినందించారు. ప్రధాని మోడీ కూడా నోనియా కమ్యూనిటీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పుడు డిప్యూటీ పార్లీ నేతగా ఎదిగిన బెట్టియా రేణుదేవిని అభినందించారు.
నవంబర్ 10న వెలువడిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీకి 75, బీజేపీకి 74, జేడీయూ 43, కాంగ్రెస్ 19, ఎల్జేపీ 1, ఇతరులు 31 స్థానాలు వచ్చాయి. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏకు 125 సీట్లు రాగా, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమికి 110 స్థానాలు వచ్చాయి. దీంతో ఎన్డీఏ మరోసారి బీహారా్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.