'వరకట్నం' తీసుకునే పెళ్లిళ్లను బాయ్కాట్ చేయండి: నితీష్ కుమార్
వరకట్నం తీసుకుని పెళ్లిళ్లు చేసుకునే వివాహా వేడుకలకు వెళ్లవద్దని ప్రజలకు నితీష్ సూచించారు. వరకట్నం తీసుకున్నట్లు తెలిస్తే.. ఆ పెళ్లి వేడుకలకు దూరంగా ఉండండి అంటూ పిలుపునిచ్చారు.
పాట్నా: హైకోర్టు కాదన్నా సరే సుప్రీం కోర్టు మెట్లెక్కి మరీ మద్యపాన నిషేధాన్ని అమలు చేయడంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ మొత్తం దేశానికి ఆదర్శంగా నిలిచారు. తాజాగా మరో ఆదర్శవంత నిర్ణయం తీసుకుని మరోసారి దేశవ్యాప్తంగా హైలైట్ గా మారారు.
రాష్ట్రంలో జరిగే వరకట్న వివాహాలను, బాల్య వివాహాలను బాయ్ కాట్ చేయాలని సీఎం నితీష్ కుమార్ బీహార్ ప్రజలకు సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 126వ జయంతి సందర్బంగా ఆయన ఈ సూచన చేశారు. జయంతి ఉత్సవాల్లో ప్రసంగిస్తూ.. వరకట్నం తీసుకునేవారిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
వరకట్నం తీసుకుని పెళ్లిళ్లు చేసుకునే వివాహా వేడుకలకు వెళ్లవద్దని ప్రజలకు నితీష్ సూచించారు. వరకట్నం తీసుకున్నట్లు తెలిస్తే.. ఆ పెళ్లి వేడుకలకు దూరంగా ఉండండి అంటూ పిలుపునిచ్చారు. సమాజంలో పేరుకుపోయిన వరకట్న దురాచారాన్ని నిర్మూలించాల్సిన అవసరముందన్నారు.
వరకట్న వివాహాలతో పాటు బాల్య వివాహాలను కూడా అరికట్టాలని నితీష్ పేర్కొన్నారు. బాల్య వివాహాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. మద్య నిషేధాన్ని ఎంత పక్కాగా అమలు చేశామో ఇప్పుడు వరకట్న, బాల్య వివాహాల పట్ల కూడా పట్టు విడవకుండా పోరాడాతామని అన్నారు.
ఎస్కే మెమోరియల్ హాల్ లో జేడీయూ నిర్వహించిన ఈ ఈవెంట్ లో రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ లీడర్ శ్యామ్ రజక్, మాజీ అసెంబ్లీ స్పీకర్ ఉదయ్ నారాయణ చౌదరి సహా పలువురు పాల్గొన్నారు.