పుకార్లకు చెక్ పెట్టిన అమిత్ షా.. బీహార్లో ఎన్డీఏ సీఎం అభ్యర్థిపై క్లారిటీ.. బీజేపీ నేతల మౌనం
ఒక్కో రాష్ట్రంలో మిత్ర పార్టీలను దూరం చేసుకుంటూ వరుసగా నష్టాలు చవిచూస్తోన్న బీజేపీ.. బిహార్ లో మాత్రం ఆ పొరపాటు చేయబోవడంలేదు. ఈ ఏడాది నవంబర్ లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని, ఒకవేళ జేడీయూతో కలిసి పోటీచేసినా సీఎం పీఠంపైమాత్రం బీజేపీ నేతనే కూర్చోబెడుతుందంటూ కొద్దిరోజులుగా వస్తున్న పుకార్లను ఆ పార్టీ చీఫ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొట్టిపారేశారు.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను సమర్థిస్తూ, దానిపై ప్రజల్లో అవగాన కల్పించేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన మీటింగ్ లో అమిత్ షా పాల్గొన్నారు. గురువారం వైశాలి పట్టణంలోని ఘరౌనా పొఖర్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయేకు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ.. బీహార్ లో సీఎం నితీశ్ కుమార్ నాయకులుగా ఉంటారని క్లారిటీ ఇచ్చారు.
బీహార్ లో ఎన్ఆర్సీని అమలు చేసి తీరాల్సిందేనన్న సీఎం నితీశ్ కుమార్.. సీఏఏ విషయంలో మాత్రం అభ్యంతరాలు చెప్పడం, దాన్ని అమలు చేయబోనివ్వమంటూ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో అమిత్ షా కీలక కామెంట్లు చేశారు. సీఏఏపై నితీశ్ కుమార్ ను ఒప్పిస్తామని, ఆ ప్రక్రియ బీహార్ లో సజావుగా సాగుతుందన్న నమ్మకం ఉందని షా అన్నారు. సీఏఏ నిరసనల్లో హింసకు ప్రతిపక్ష పార్టీలదే బాధ్యత అని విమర్శించారు.
మొత్తం 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీ గడువు ఈ ఏడాది నవంబర్ లో ముగుస్తుంది. 2015లో జరిగిన ఎన్నికల్లో నితీశ్ నాయకత్వంలోని జేడీయూ, లాలూ చీఫ్ గా ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా కూటమిగా పోటీచేసి అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. ఆ తర్వాత ఏడాదికే నితీశ్.. లాలూను కాదని బీజేపీతో చేతులుకలిపారు. 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత క్రమంగా బీజేపీకి దూరమవుతున్నట్లు నితీశ్ సంకేతాలిచ్చినా.. గురువారంనాటి అమిత్ షా ప్రకటనతో పుకార్లన్నీ పటాపంచలయ్యాయి.