ఒకే పదవి ఇవ్వడంపై నితీశ్ అలక... మోడీ కేబినెట్లో చేరేందుకు విముఖత..
ఢిల్లీ : ఎన్డీఏ సర్కారు రెండోసారి కొలువుదీరకముందే కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని మిత్రపక్షమైన జేడీయూ అలిగింది. మోడీ 2.0 కేబినెట్లో తమకు కేవలం ఒకే ఒక మంత్రి పదవి కేటాయించడంపై ఆ పార్టీ చీఫ్ నితీశ్ కుమార్ అసంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్ర మంత్రిమండలిలో చేరేందుకు నిరాకరించారు. అయితే బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతామని నితీశ్ స్పష్టం చేశారు. జేడీయూ నిర్ణయంపై బీజేపీ ఇంకా స్పందించకపోవడం గమనార్హం.
సార్వత్రిక ఎన్నికల్లో బీహార్లో బీజేపీ, జేడీయూలు కలిసి పోటీ చేశాయి. ఇరు పార్టీలు చెరి 17 స్థానాల్లో పోటీ చేయగా... జేడీయూ 16 సీట్లలో విజయం సాధించింది. లోక్సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన బీజేపీ 303 సీట్లు గెలిచి మేజిక్ ఫిగర్ సాధించింది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమున్నా భాగస్వామ్యపక్షాలతో కలిసి ముందుకుసాగింది. అయితే కేబినెట్లో కనీసం రెండు స్థానాలైనా దక్కుతాయని జేడీయూ భావించింది. మంత్రిమండలి కూర్పు సందర్భంగా అమిత్ షా నితీశ్ కుమార్తో సంప్రదింపులు జరిపినప్పటికీ చివరకు ఒక పదవి ఇచ్చేందుకు మాత్రమే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. దీంతో నితీశ్ మంత్రివర్గంలో భాగస్వామి అయ్యేందుకు నిరాకరించినట్లు సమాచారం.
గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంతో 2013లో జేడీయూ ఎన్డీఏ నుంచి వైదొలగించింది. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పోటీ చేసింది. పొత్తు విచ్చిన్నం కావడంతో నితీశ్ కుమార్ 2017లో మరోసారి ఎన్డీయేలో చేరారు.