లాలూకు నితీష్ షాక్: తేజస్వి యాదవ్ డిప్యూటీ సిఎం పదవికి చెక్?
బీహార్లో రాజకీయ పరిణామాలు మరోసారి వేడెక్కాయి. జేడీయూ - ఆర్జేడీ మధ్య అగాథం పెరుగుతోంది. తెగతెంపులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పాట్నా: బీహార్లో రాజకీయ పరిణామాలు మరోసారి వేడెక్కాయి. జేడీయూ - ఆర్జేడీ మధ్య అగాథం పెరుగుతోంది. తెగతెంపులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతిచ్చేందుకు నితీష్ సిద్ధంగా ఉన్నారు. లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ విపక్ష అభ్యర్థి మీరా కుమార్కు మద్దతిస్తున్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై సిబిఐ, ఈడీ దాడులు కొనసాగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్, లాలూల మధ్య గ్యాప్ పెరిగింది. ఈ దాడులపై నితీష్ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది.
ఈ నేపథ్యంలో, ఈ రోజు లాలూ నేతృత్వంలో ఆర్జేడీ పార్టీ కీలక సమావేశం జరగబోతోంది. బీహార్ లో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
మరోవైపు, నితీష్ కూడా తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంగళ వారం భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా లాలూ కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ను పదవి నుంచి వైదొలగాలంటూ నితీష్ కుమార్ కోరే అవకాశముందని తెలుస్తోంది.
అయితే, తనంతట తానుగా తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తే బాగుంటుందనే యోచనలో నితీష్ ఉన్నారని తెలుస్తోంది. ఆయన నుంచి ప్రకటన వెలువడకపోతే... రేపు జరిగే సమావేశంలో నితీషే ఈ మేరకు ఒత్తిడి తెచ్చే అవకాశముందంటున్నారు.
వాస్తవానికి సోమవారం (ఈ రోజు) రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లోక్ సంవాద్ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే, సీఎం అనారోగ్యంతో ఉన్నారని, అందువల్ల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంతో వేదికను పంచుకోవాల్సి ఉండటం కారణంగానే నీతీష్ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారని అంటున్నారు.