నివర్ తుఫాన్ ఎఫెక్ట్... చెన్నై ఎయిర్పోర్ట్ మూసివేత... రేపు కూడా పబ్లిక్ హాలీ డే...
నివర్ తుఫాన్ నేపథ్యంలో ముందు జాగ్రత్తలో భాగంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం రాత్రి 7గంటల నుంచి గురువారం ఉదయం 7గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. తుఫాను తీవ్రరూపం దాలుస్తుండటంతో ప్రయాణికుల భద్రతా రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల పట్ల తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గురువారం(నవంబర్ 26) సెలవు ప్రకటించింది. బుధవారం కూడా ప్రభుత్వం పబ్లిక్ హాలీ డే ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి నుంచి మెట్రో రైలు సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు చెన్నై మెట్రో అధికారులు తెలిపారు. గురువారం వాతావరణ పరిస్థితులను బట్టి రైళ్ల పునరుద్దరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ముందు జాగ్రత్తలో భాగంగా అశోక్ లేల్యాండ్ యాజమాన్యం కూడా చెన్నైలోని తమ ప్లాంట్ను మూసివేసింది.
వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... రాబోయే 12గంటల్లో నివర్ తుఫాన్ తీవ్రరూపం దాల్చవచ్చు. బుధవారం అర్ధరాత్రి,గురువారం తెల్లవారుజాము మధ్యన పుదుచ్చేరి వద్ద ఏ క్షణమైనా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే పుదుచ్చేరిలో మూడు రోజుల పాటు ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. రాష్ట్రవ్యాప్తంగా 1200 మంది ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించింది. మరో 800 మంది సిబ్బందిని సిద్దంగా ఉంచింది. ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎన్ ప్రధాన్ మాట్లాడుతూ... ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లోని దాదాపు లక్ష మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. అలాగే పుదుచ్చేరిలో వెయ్యి మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు.
నివర్ తుఫాన్పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. తుఫాన్ బాధితులకు సహాయం అందించేందుకు సిద్దంగా ఉండాలని చెన్నైలోని ఆమ్ ఆద్మీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ తుఫాన్ను ఎదుర్కొంటాయని బావిస్తున్నట్లు తెలిపారు.