నివర్ తుఫాన్ : మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన మోదీ
నివర్ తుఫాన్ కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు రూ.2లక్షలు ఎక్స్గ్రేషియా అందిస్తామని ప్రధాని మోదీ మామీ ఇచ్చారు. గాయపడ్డవారికి రూ.50వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం(నవంబర్ 27) తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో మాట్లాడిన సందర్భంగా ప్రధాని ఈ హామీలిచ్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తమిళనాడులో తుఫాన్ ప్రభావిత పరిస్థితులను సీఎంను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల కోసం కేంద్ర బృందాలు పంపిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ తమిళనాడులో తుఫాన్ కారణంగా నలుగురు చనిపోయినట్లు సీఎం పళనిస్వామి ప్రధాని మోదీకి తెలిపారు.చాలాచోట్ల వృక్షాలు నేలకొరిగినట్లు చెప్పారు.పెద్ద సంఖ్యలో పశువులు మేకలు మృత్యువాత పడినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.3 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించినట్లు పేర్కొన్నారు.
కాగా,నివర్ తుఫాన్ నుంచి తేరుకోకముందే తమిళనాడుకు మరో తుఫాన్ గండం పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. రాగల 48గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 30న అది బలపడి పుదుచ్చేరి వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దాని ప్రభావంతో తమిళనాడు,పుదుచ్చేరిలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Recommended Video
తుఫాన్ ప్రభావంతో ఇటు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు,నెల్లూరు,కడప,ప్రకాశం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల పంటలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. డిసెంబర్ 15 లోగా పంట నష్టాన్ని అంచనా వేసి... పంట దెబ్బతిన్న రైతులకు డిసెంబర్ నెలాఖరులోగా పరిహారం అందించాలని నిర్ణయించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాతో పాటు పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో శనివారం(నవంబర్ 28) సీఎం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.