కరోనా చంపేస్తున్నా.: నిజాముద్దీన్లో వేలాదిమంది ప్రార్థనలు, వారికి కరోనా పాజిటివ్, మౌలానాపై ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: ఓ వైపు కరోనావైరస్ కారణంగా వేలాది మంది మరణిస్తుంటే.. దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో భారీ సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించడంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఆ ప్రార్థనల్లో పాల్గొన్న పలువురికి కరోనావైరస్ సోకడం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే ఈ ప్రార్థనలు నిర్వహించిన మౌలానాపై కేసు నమోదు చేయాలంటూ సీఎం కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు.
మార్చి 1-15 వరకు స్థానిక నిజాముద్దీన్ మార్కజ్ మసీదు ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనలకు సుమారు 2వేల మంది హాజరయ్యారు. వీరిలో మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గిజిస్థాన్ దేశాలకు చెందిన యాతత్రికులు ఉన్నారు. వీరి ద్వారానే కరోనావైరస్ స్థానికులకు సోకినట్లు అనుమానిస్తున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరికి అప్పటికే కరోనా సోకగా, మరికొందరు అనుమానిత లక్షణాలతో ఉన్నారు.
కాగా, ఇక్కడికి ప్రార్థనలకు వచ్చి వెళ్లిన మత గురువు ఒకరు శ్రీనగర్లో మృతి చెందారు. నిజాముద్దీన్కు రావడానికి ముందు ఉత్తరప్రదేశ్లోని దియోబండ్ ప్రాంతంలో ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. దీంతో అక్కడ కూడా కరోనా ఎవరికైనా సోకిందా? అనేది తేలాల్సి ఉంది.
Recommended Video
రెండ్రోజుల క్రితం 30 మందిని కరోనా పరీక్షల కోసం ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని, వీరిలో ఏడుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఈ ప్రాంతంలో సంచరించడంతో ఈ ప్రాంతంలోని ప్రజలందరినీ పరీక్షించాల్సి వస్తుందని తెలిపింది. కాగా, ఢిల్లీలో ఇప్పటి వరకు 97 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇక్కడ జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న తెలంగాణకు చెందిన నలుగురు కూడా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.