ఢిల్లీలో కరోనా టెర్రర్ ... నిజాముద్దీన్ లో సభ ఎఫెక్ట్ ..కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
ఢిల్లీ లో కరోనా టెర్రర్ పెరిగిపోయింది . ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న వారు చాలా మందికి కరోనా పాజిటివ్ రావటంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది . ఇక ఈ మతపరమైన ప్రార్ధనలలో పాల్గొన్న వారే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. దీంతో నిజాముద్దీన్లో పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నిజాముద్దీన్ వాసులను ఢిల్లీలోని వేర్వేరు ఆస్పత్రులకు బస్సుల్లో తరలించి వారికి కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కాకినాడ తీరంలో రెండు విదేశీ కార్గో షిప్ లు .. కరోనా టెన్షన్లో తీరప్రాంత వాసులు
తబ్లీఘీ-జమాత్ మతప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వారికి కరోనా పాజిటివ్
నిన్న ఢిల్లీలో నమోదైన 25 కేసుల్లో 18 మంది నిజాముద్దీన్ కు చెందిన వ్యక్తులే కావటం , ఇక వివిధ రాష్ట్రాల్లో కరోనా బారిన పడిన వారు నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో మార్చి 10న జరిగిన తబ్లీఘీ-జమాత్ మతప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వారు కావటంతో ఇప్పుడు ఈ మత ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వారిపై దృష్టి సారించారు అన్ని రాష్ట్రాల అధికారులు. తబ్లీఘీ-జమాత్ మతప్రచార కార్యక్రమంలో మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గిస్తాన్తో పాటు పలు దేశాలకు చెందిన మత ప్రచారకులు హాజరయ్యారు. ఇక వీరి నుండి కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్టు తెలుస్తుంది .
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులకు మూలం అయిన సభ
దేశ వ్యాప్తంగా బయటపడుతున్న కరోనా పాజిటివ్ కేసులకు మూలం తబ్లీఘ్-ఈ-జమాత్ మత ప్రచార సభ అని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . అంతేకాదు తెలంగాణ, కాశ్మీర్ మృతి చెందిన కరోనా బాధితులు ఈ సభకు హాజరైనవారేనని తెలుస్తుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికులు ఈ సభకు హాజరయినట్లు తెలుస్తోంది. అంతేకాదు కరీంనగర్లో బయటపడ్డ కరోనా పాజిటివ్ వచ్చిన ఇండోనేషియా వాసులు కూడా తబ్లీఘ్-ఈ-జమాత్కు హాజరయ్యారు.
అలెర్ట్ అయిన ఢిల్లీ సర్కార్ .. నిజాముద్దీన్ ప్రాంత ప్రజలకు పరీక్షలు
ఓ వైపు లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న నేపధ్యంలో కూడా తబ్లిఘ్-ఈ-జమాత్ కార్యక్రమాలు జరిగాయి. దీంతో లాక్డౌన్ ఉల్లంఘనలపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఏది ఏమైనా చేతులు కాలక ఆకులు పట్టుకున్న చందంగా కరోనా బాగా ప్రబలిన తర్వాత ఇప్పుడు కేసులు నమోదు చేసి ఏం లాభం అంటున్నారు ప్రజలు .ఇక ఆలస్యంగానైనా కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అయిన సభకు హాజరు అయిన వారిపై , అలాగే నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన వారిపై దృష్టి పెట్టిన సర్కార్ కరోనా పాజిటివ్ బాధితుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. సభకు వచ్చిన వారు, ఆలాగే ఆ ప్రాంత వాసులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. ఇక ఢిల్లీ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.