సాధ్యమేనా?: ‘ఇక మధ్యాహ్న భోజనానికి ఆధార్ తప్పనిసరి’
మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న వంటవారు, విద్యార్థులకు ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ.
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ మరో కష్టసాధ్యమైన కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అదేంటంటే.. మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న వంటవారు, విద్యార్థులకు ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ. ఇప్పటికీ ఆధార్కార్డు లేనివారికి జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించింది.
పాఠశాల విద్యకు సంబంధించిన రాయితీ పథకాలను ఆధార్తో అనుసంధానించడానికి కేంద్రం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం ఉపక్రమించింది.
మధ్యాహ్న భోజన పథకంలో పారదర్శకతకు, సమర్థంగా అమలు చేసేందుకు ఆధార్తో అనుసంధానించాలని నిర్ణయించారు. త్వరలోనే ఈ మేరకు పాఠశాలలకు నోటిఫికేషన్ పంపించనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వంటవారు/సహాయకులను కూడా లబ్ధిదారులుగానే పరిగణిస్తున్నామని, అందుకే వారు కూడా ఆధార్ను చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అయితే, పాఠశాలల్లో చదువుకుంటున్న చిన్నారులకు కూడా ఆధార్ తప్పనిసరి చేయడం పట్ల పలువురు తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. మధ్యాహ్న భోజనం కావాలంటే చిన్నారులు కూడా ఆధార్ కార్డు కోసం తిరుగాలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతీ పాఠశాలకు వచ్చి సిబ్బందే ఆధార్ కార్డులను ఇచ్చేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.