హింస, తిండి కూడా పెట్టలేదు: ఐశ్వర్యరాయ్ ఆవేదన, అత్తింటిపై సంచలనం
లక్నో: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు, తేజ్ ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యరాయ్ అత్తింటివారిపై సంచలన ఆరోపణలు చేశారు. తన అత్త, మాజీ సీఎం రబ్రీదేవి, ఆమె కూతురు మీసా భారతి తనపై మానసిక, శారీరక వేధింపులకు పాల్పడ్డారని తెలిపింది.
అత్తాఆడపడచు వేధింపులు..
అత్త రబ్రీదేవితో కలిసి ఆడపడచు మీసా భారతి తనపై గృహహింసకు పాల్పడ్డారని, కనీసం తిండి కూడా పెట్టలేదని ఐశ్వర్యారాయ్ ఆరోపించారు. తన సంసార జీవితాన్ని నాశనం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. తన భర్త తేజ్ ప్రతాప్, మరిది తేజస్వి యాదవ్ ల మధ్య విభేదాలు సృష్టించడానికి మీసా భారతి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
అనుచితంగా ప్రవర్తిస్తున్నారు..
కాగా, రబ్రీదేవి తన కూతురు పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఐశ్వర్య తండ్రి, ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రికా రాయ్ ఆరోపించారు. గృహహింస కింద కేసు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తన కూతురుకు తన అత్త ఇంట్లో ఎలాంటి హక్కులు లేవని ఆరోపించారు.
వాస్తవం లేదంటూ మీసా భారతి..
ఇది ఇలా ఉండగా, రాజ్యసభసభ్యులైన మీసా భారతి.. ఐశ్వర్యరాయ్ ఆరోపణలను ఖండించారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉంటున్న తాను ఆమెను ఎలా వేధించగలను అని ప్రశ్నించారు. తానెప్పుడు ఆమెను సోదరిలా భావించినట్లు తెలిపారు. ఐశ్వర్య ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.ఐశ్వర్య తన తల్లిదండ్రుల ఆదేశాల మేరకే ఇలా చేస్తోందని ఆరోపించారు.
ఘనంగా పెళ్లి.. కొద్ది రోజులకే..
2018, మే నెలలో ఐశ్వర్య, తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం ఘనంగా జరిగింది. వివాహమైన కొద్ది నెలలకే వీరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తన భర్త తేజ్ ప్రతాప్ డ్రగ్స్ కు బానిస అయ్యాడని మొదట ఆరోపించారు. ఆ తర్వాత అతని ప్రవర్తన సరిగా లేదని వెల్లడించారు. న అత్తమామలకు ఈ విషయం తెలిపినా వారు పట్టించుకోవడం లేదని తన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. అంతేగాక, డ్రగ్స్ తీసుకున్న తర్వాత తేజ్ ప్రతాప్.. శ్రీకృష్ణుడిగా, రాధగా దుస్తులు ధరించేవాడని ఐశ్వర్య తెలిపింది.
తనను కాపాడాలంటూ..
గృహ హింస నుంచి తనను కాపాడాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తేజ్ ప్రతాప్ కూడా గత ఏడాది విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. విడాకుల కేసుకు సంబంధించి కోర్టుకు బదులిచ్చిన నెల రోజులు ముగిసిన తర్వాత ఈ సెప్టెంబర్ నెలలోనే లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు, తేజ్ ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యా రాయ్ కన్నీటితో అత్తారింటిని పుట్టింటికి వెళ్లిపోయారు. తండ్రి చంద్రికారాయ్ వాహనంలో ఆమె అత్త రబ్రీదేవి ఇంటి నుంచి పయనమయ్యారు.