ఏదైనా జరగొచ్చు: వైయస్ జగన్తో పొత్తుపై మొయిలీ
బెంగళూర్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పొత్తు విషయంపై కేంద్ర మంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కాంగ్రెసుకు పొత్తు లేదని, అయితే భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చునని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని ఆయన అన్నారు.
ఆంటోనీ కమిటీ నివేదిక తయారవుతోందని, త్వరలోని నివేదికను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పిస్తామని, దానిపై సోనియా నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. అంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయం కారణంగా తలెత్తే సమస్యలపై తెలంగాణ, సీమాంధ్ర నేతల అభిప్రాయాలను తెలుసుకోవడానికి కాంగ్రెసు పార్టీపరంగా ఆంటోనీ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, తెలంగాణపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే త్వరలో నోట్ తయారు చేసి మంత్రివర్గం ముందు పెడుతారని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ న్యూఢిల్లీలో అన్నారు. సోనియా గాంధీతో భేటీ అయిన తర్వాత బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజీనామాలు చేయవద్దని ఆయన సీమాంధ్ర పార్లమెంటు సభ్యులకు సూచించారు. సీమాంధ్ర ప్రాంతంలో అన్ని ప్రయివేటు సంస్థలు పని చేస్తుంటే ప్రభుత్వ కార్యాలయాలు ఎందుకు బందు చేస్తున్నారని ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె మాని విధులకు హాజరు కావాలని సూచించారు. తెలంగాణపై హోంశాఖ ముసాయిదా తయారు చేస్తోందన్నారు. కేబినెట్ నోట్ తయారైన తర్వాత అసెంబ్లీకి పంపిస్తామని చెప్పారు.