Coronavirus positive: అంబులెన్స్ రాలేదని సీఎం ఇంటికి వెళ్లి బాహుబలి సినిమా చూపించాడు !
బెంగళూరు: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ కేసులు 10 లక్షలు దాటిపోయాయి. ఇక కర్ణాటకలో గత 15 రోజుల నుంచి కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేస్తోంది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఓ యువకుడు COVID -19 హెల్త్ లైన్ నెంబర్ కు పదేపదే ఫోన్ చేసి మనవి చేశాడు. అయితే అంబులెన్స్ పంపించకుండా అధికారులు నిర్లక్షం చేశారు. ఎక్కడ తన వలన తన భార్య, పిల్లలకు కరోనా సోకుతుందో అనే భయంతో ఆ యువకుడు ఆందోళన చెందాడు. భార్య, ఇద్దరు పిల్లలను వెంట పెట్టుకుని 4 కిలోమీటర్లు నడుచుకుంటూ నేరుగా సీఎం ఇంటికి వెళ్లి అందరికీ బాహుబలి సినిమా చూపించాడు. విషయం తెలుసుకున్న అధికారులు షాక్ కు గురై అప్పుడు కళ్లు తెరచి అంబులెన్స్ లో ఆయువకుడిని ఆసుపత్రికి తరలించారు.
Mehandi సందడి: పెళ్లి కూతురితో సహ ఫ్యామిలీ మొత్తం కరోనా పాజిటివ్, పెళ్లి కొడుకు పరుగో పరుగు, పాపం !
బెంగళూరులో ఫ్యామిలీ
ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు నగరంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కర్ణాటకలోని దావణగెరెకి చెందిన శంకర్ (32) అనే యువకుడు బెంగళూరు చేరుకుని ప్రముఖ మెడికల్ కాలేజ్ లో బస్సు డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. శంకర్ కు భార్య, ఐదు సంవత్సరాల కుమారుడు, 10 నెలల కుమార్తె ఉన్నారు.
చిన్న ఇంట్లో కాపురం
బెంగళూరులోని బనశంకరిలోని 12X12 విస్తీర్ణం ఉన్న చిన్న ఇంట్లో శంకర్ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. సోమవారం శంకర్ కు జ్వరం ఎక్కువగా వచ్చింది. బెంగళూరులో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, ఎందుకైనా మంచిది అంటూ శంకర్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
కరోనా పాజిటివ్ అంటూ ఫోన్
గురువారం ఉదయం 9. 30 గంటల సమయంలో శంకర్ కు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. నీకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసిందని, నువ్వు వెంటనే ఆసుపత్రిలో చేరి COVID-19 వ్యాధి నయం కావడానికి చికిత్స చేసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది శంకర్ కు సూచించారు. తనకు కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే శంకర్ ఆందోళనకు గురైనాడు.
అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే
తనకు కరోనా వైరస్ పాజిటివ్ అని తెలలిసిన తరువాత శంకర్ లో ఆందోళన ఎక్కువ అయ్యింది. అదే సమయంలో కుమారుడికి జ్వరం రావడంతో శంకర్ హడలిపోయాడు. ఇంట్లో ప్రత్యేక గది లేకపోవడం, క్వారంటైన్ లో ఉండటానికి అవకాశం లేకపోవడంతో వెంటనే COVID-19 హెల్త్ లైన్ కు ఫోన్ చేసి అంబులెన్స్ పంపించాలని శంకర్ మనవి చేశాడు. ఎంతసేపటికి అంబులెన్స్ రాకపోవడంతో శంకర్ పదేపదే COVID-19 హెల్త్ లైన్ కు ఫోన్ చేసి అంబులెన్స్ పంపించాలని వేడుకున్నాడు.
సీఎంకు బాహుబలి సినిమా చూపించాలని !
COVID-19 హెల్త్ లైన్ సిబ్బంది నిర్లక్షంతో విసిగిపోయిన శంకర్ లాక్ డౌన్ సందర్బంగా ఆటోలు లేకపోవడంతో భార్య, ఇద్దరు పిల్లలను వెంట పెట్టుకుని బనశంకరిలోని ఇంటి నుంచి బయలుదేరి ఏకంగా నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ ఆనంద్ రావ్ సర్కిల్ సమీపంలోని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అధికార నివాసం ఉన్న కృష్ణ దగ్గరకు నేరుగా వెళ్లాడు. కృష్ణ భవనం గేటు దగ్గర శంకర్ ను అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని ఏం జరిగింది ? ఎందుకు నువ్వు ఫ్యామిలీని వెంట వేసుకుని వచ్చావ్ ? అని ప్రశ్నించారు.
నీ దుంపతెగ.... ఎంత పనిచేశావ్ !
నా పేరు శంకర్, ఈమె నాభార్య, వీరు నా పిల్లలు, నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. మీరు అంబులెన్స్ పంపించలేదు, అందుకే సీఎంకు చెప్పాలని, సహాయం చెయ్యాలని మనవి చెయ్యడానికి వచ్చాను అంటూ సమాధానం ఇచ్చారు. కరోనా పాజిటివ్ వ్యక్తి వచ్చాడని తెలుసుకున్న సెక్యూరిటీ సిబ్బంది పోలీసు అధికారులు హడలిపోయారు, నీ దుంపతెగ ఎంతపని చేశావ్ అంటూ వెంటనే అంబులెన్స్ ను అక్కడికి పిలిపించి అందులో శంకర్ ను కేజీ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
Recommended Video
ఇది బెంగళూరు పరిస్థితి ?
కేజీ జనరల్ ఆసుపత్రిలో శంకర్ కు కరోనా వైరస్ వ్యాధి నయం కావడానికి చికిత్స అందిస్తున్నారు. బెంగళూరులో కరోనా వైరస్ వ్యాధి సోకిన రోగులను సరైన సమయంలో ఆసుపత్రులకు తరలించడానికి సక్రమంగా అంబులెన్స్ లు లేవని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సమయంలో ఈ సంఘటన వెలుగు చూడటంతో బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం ఉలిక్కిపడింది.