చిదంబరం సాక్షులను ప్రభావితం చేస్తారు, బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో
ఐఎన్ఎక్స్ మీడియా కేసు మాజీ కేంద్రమంత్రి పి చిదంబరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇప్పటికే తీహార్ జైలులో ఉన్న చిదంబరానికి బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఐఎన్ఎక్స్ కేసుకు సంబంధించి ముడుపుల వ్యవహారంలో చిదంబరం సాక్ష్యాలను ట్యాంపర్ చేయలేరని, కానీ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో చిదంబరానికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి కాదని చిదంబరం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో చిదంబరం తరఫున కపిల్ సిబాల్ వాదనలు వినిపించగా, సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు చిదంబరానికి బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సాక్ష్యాలను మార్చే పరిస్థితి లేదని కోర్టు కూడా అభిప్రాయపడింది. కానీ సాక్షులను మాత్రం మాజీ కేంద్రమంత్రి చిదంబరం ప్రభావితం చేసే అవకాశం ఉందని అంగీకరించింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసు కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని వెంటాడుతుంది. ఐఎన్ఎక్స్ మీడియాలో పెట్టిన విదేశీ పెట్టుబడులు రూ.305 కోట్లు అక్రమమని దర్యాప్తు సంస్థలు ఎఫ్ఐఆర్ నమోదు చేశాయి. గత నెలలో చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కస్టడీకి తీసుకొని ఐఎన్ఎక్స్ మీడియా కేసులోకి నగదు ప్రవాహంపై ప్రశ్నలు గుప్పించారు. చిదంబరం కుమారుడు కార్తీని కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. మరోవైపు ఐఎన్ఎక్స్ మీడియా అధిపతి పీటర్ ముఖర్జీ అప్రూవర్గా మారిపోయిన సంగతి తెలిసిందే.