బెడ్లు ఖాళీగా లేవు! 18 ఆస్పత్రులు తిరిగి, కరోనా లక్షణాలతో చివరకు ప్రాణాలు కోల్పోయాడు
బెంగళూరు: కరోనావైరస్ లక్షణాలతో బాధపడుతున్న ఓ 50ఏళ్ల వ్యక్తి బెంగళూరులోని 18 ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. ఈ ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా లేవని చెప్పడంతో తిరిగి తిరిగి అలసిపోయిన ఆ వ్యక్తి మళ్లీ తన ఇంటికి చేరుకున్నాడు. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు: 16వేల మార్క్ దాటాయి, మరో 7 మరణాలు
బెంగళూరులోని నగరథపేట్కు చెందిన బాధితుడు 24 గంటల్లోనే శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై మరణించిన వ్యక్తి మేనల్లుడు మీడియాతో మాట్లాడారు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఒక అంబులెన్స్ బుక్ చేసుకుని నగరంలోని ఆస్పత్రుల చుట్టూ తిరిగామని చెప్పాడు.
ఓ ప్రభుత్వ ఆస్పత్రితోపాటు 18 ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరిగామని, బెడ్లు ఖాళీగా లేవంటూ తన మామను ఏ ఆస్పత్రి కూడా అడ్మిట్ చేసుకోలేదని తెలిపాడు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బౌరింగ్ ఆస్పత్రికి తీసుకెళితే కరోనా టెస్టు రిపోర్టు అడిగారని తెలిపాడు. అప్పటికే శనివారం సాయంత్రం కావడంతో పరీక్ష చేయడం సాధ్యం కాలేదని పేర్కొన్నాడు. .
ఆస్పత్రి ఐసీయూలో బెడ్లు ఖాళీగా లేవని చెప్పిన ఆస్పత్రి యాజమాన్యాలు తిరిగి పంపించేశారని వాపోయాడు. అపోలో, ఫోర్టిస్, మణిపాల్ లాంటి చాలా ఆస్పత్రులు కూడా ఐసీయూలో బెడ్లు ఖాళీగా లేవని చెప్పాయని తెలిపాడు. 18 ఆస్పత్రులు కూడా బెడ్లు లేవనే కారణం చెప్పాయని చెప్పాడు.
శనివారం రాత్రి మొత్తం ఆస్పత్రుల చుట్టూ తిరిగామని, ఆదివారం ఉదయం 4.30గంటలకు తిరిగి ఇంటికి చేరుకున్నామని తెలిపాడు. ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేసి ఇంట్లోనే వైద్యం అందించామని చెప్పాడు. ఆదివారం ఓ ప్రైవేటు ల్యాబ్ ద్వారా ఆయనకు కరోనా టెస్ట్ నిర్వహించామని, సోమవారం ఫలితం తేలుతుందని చెప్పారని తెలిపాడు.
ఆదివారం కూడా మరోసారి ఆస్పత్రుల చుట్టూ తిరిగామని.. అప్పుడు కూడా బెడ్లు లేవని సమాధానమే వచ్చిందని వాపోయాడు. తాము ఎంత వేడుకున్నా ఏ ఆస్పత్రి యాజామన్యం కూడా అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మానవత్వం చచ్చిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బౌరింగ్ ఆస్పత్రి చివరకు తమ మామను చేర్చుకుందని, అయితే అప్పటికే పరిస్థితి విషమంగా ఉందని తెలిపాడు.
ఆస్పత్రిలో వెంటిలేటర్పై పెట్టిన 10 నిమిషాలకే తమ మామ ప్రాణాలు వదిలాడని కన్నీటిపర్యంతమయ్యాడు. కరోనా ప్రభావం ఇంతలా ఉన్నా ప్రభుత్వం ఆస్పత్రుల్లో ఎలాంటి సదుపాయాలను కల్పించడం లేదని ఆరోపించారు. కాగా, సోమవారం ప్రభుత్వ ఆదేశాలతో బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రులు అదనంగా 2500 బెడ్లను ఏర్పాటు చేశాయి. వీటిని కరోనా రోగుల చికిత్స కోసం ఉపయోగించనున్నారు.