'బెగ్గింగ్' వద్దు: రాజ్యసభలో మరోసారి వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: బెగ్గింగ్ అనే పదాన్ని ఉపయోగించవద్దని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి సూచించారు. రాజ్యసభలో పత్రాలను ప్రవేశపెట్టేటప్పుడు సభ్యులు ఐ బెగ్గింగ్ అనే పదాన్ని ఉపయోగించొద్దని శుక్రవారం మళ్లీ గుర్తుచేశారు.
కేంద్రమంత్రి పీపీ చౌదరి సభలో మాట్లాడుతూ.. ఐ బెగ్ అన్నారు. వెంటనే ఆయన మంత్రికి బెగ్ అనే పదాన్ని ఉపయోగించొద్దని సూచించారు. కేవలం పత్రాలను ప్రవేశపెడుతున్న విషయాన్ని మాత్రమే ప్రస్తావించాలని బెగ్ అనే పదాన్ని వాడొద్దన్నారు.
ఆ పదాన్ని ఉపయోగించకపోవడం మంచిదన్నారు. ఆ తర్వాత చౌదరి మాట్లాడేపుడు బెగ్ పదాన్ని ఉపయోగించలేదు. దీనిపై వెంకయ్య హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు కూడా ఆయన ఇదే సూచన చేశారు.
ఇప్పటివరకు రాజ్యసభలో పత్రాలను ప్రవేశపెట్టేటప్పుడు సభ్యులు ఐ బెగ్ టు అని పలికేవారు. అది విన్న ఆయన ఆ పదాన్ని వాడొద్దని సూచించారు. అది వలసవాదానికి నిదర్శనమని, ప్రస్తుతం మనం స్వతంత్ర భారతదేశంలో జీవిస్తున్నామన్నారు.