చైనాకు ఆగ్రహం తెప్పించే పని: దలైలామాకు బర్త్డే విషెస్ చెప్పని మోడీ: యూఎస్ సైతం గ్రీటింగ్స్
న్యూఢిల్లీ: దలైలామా..ఆసియా దేశాల్లో పరిచయం అక్కర్లేని పేరు. టిబెట్కు చెందిన ఈ ప్రఖ్యాత బౌద్ధమత గురువు ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. 60 సంవత్సరాలుగా హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నివసిస్తున్నారు. మంగళవారం ఆయన 85వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలను తెలిపారు. ఆ జాబితా పెద్దదే. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు మాయం కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొన్నేళ్లుగా తాను కొనసాగిస్తోన్న ఆనవాయితీని మోడీ బ్రేక్ చేయడానికి కారణమేంటని ఆరా తీస్తున్నారు.
భారత్లో భీకరంగా కరోనా విస్తరణ: సరిగ్గా 7 నెలల్లో: రోజూ 2.87 లక్షల పాజిటివ్ కేసులు నమోదు
ఆనవాయితీని బ్రేక్ చేసిన మోడీ..
అమెరికా సైతం దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం.. మోడీ ఆ పని చేయకపోవడ ఒకింత చర్చకు దారి తీసింది. నిజానికి- దలైలామా పుట్టినరోజు నాడు నరేంద్ర మోడీ ఆయనకు శుభాకాంక్షలను చెప్పడం ఆనవాయితీగా వస్తోంది. కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా ఆయన దలైలామాకు శుభాకాంక్షలను చెబుతూ వస్తున్నారు. ఈ సారి మాత్రం ఆ ఆనవాయితీని బ్రేక్ చేశారు మోడీ. ట్విట్టర్ ద్వారా గానీ.. లేక ఇంకో రూపంలో గానీ.. దలైలామాకు మోడీ నుంచి ఎలాంటి పుట్టినరోజు సందేశాలు వెళ్లలేదు. దీనికి గల కారణాలేమిటనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
రాష్ట్రపతి భవన్ నుంచి కూడా..
ఒక్క నరేంద్ర మోడీ నుంచే కాదు.. రాష్ట్రపతి భవన్ నుంచి కూడా దలైలామాకు ఎలాంటి జన్మదిన సందేశాలు వెళ్లలేదని చెబుతున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సైతం ఆయనకు శుభాకాంక్షలు చెప్పలేదని తెలుస్తోంది. మొన్నటిదాకా భారత్తో సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్విన చైనా ఉన్నఫళంగా లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవడమే దీనికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. చైనా తన సైనిక బలగాలను వాస్తవాధీన రేఖ నుంచి ఉపసంహరించుకున్న రోజే దలైలామా జన్మదినం కూడా.
చైనాకు ఆగ్రహం తెప్పించే పని అనేనా..
నయానో భయానో చైనా బలగాలు వెనక్కి తగ్గిన వేళ.. దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలను చెప్పాల్సిన పరిస్థితి వస్తే.. కథ మళ్లీ మొదటికి వస్తుందని ప్రధాని భావించారని అంటున్నారు. అందుకే ఆ పని చేయలేదని చెబుతున్నారు. గత ఏడాది ఇదే సందర్భంలో నరేంద్ర మోడీ.. నేరుగా దలైలామాకు ఫోన్ చేసి మరీ బర్త్డే విషెస్ అందించారు. ఈ సారి ఆ పని చేకపోవడం వెనుక చైనా నుంచి టిబెట్కు స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతోన్న దలైలామాకు శుభాకాంక్షలు చెప్పడం.. చైనా పాలకులను ఆగ్రహానికి తెప్పిస్తుందనే ఉద్దేశం కనిపిస్తోందని అంటున్నారు.
Recommended Video
యూఎస్ సైతం
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన కేంద్రమంత్రి కిరణ్ రిజుజు, లఢక్ లెప్టినెంట్ గవర్నర్ మాథుర్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు రామ్మాధవ్ వంటి కొందరు ప్రముఖులు దలైలామాకు బర్త్డే విషెస్ చెప్పారు. అదే సమయంలో అమెరికా సైతం దలైలామాకు శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్లోని అమెరికా రాయబారి కెన్నెత్ ఇయాన్ జస్టర్.. దలైలామాకు శుభాకాంక్షలు చెప్పారు. ధర్మశాలకు ప్రత్యేకంగా ఓ సందేశాన్ని పంపించారు. అమెరికా పౌరుల తరఫున తాను ఈ శుభాకాంక్షలను తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.