రామమందిరం నిర్మాణంకు కేంద్రం నిధులు ఇవ్వదు: అమిత్ షా
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రస్టును ఏర్పాటు చేస్తున్నామని ఇందులో సభ్యులుగా ఏ ఒక్క బీజేపీ నాయకుడు ఉండబోరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ రామమందిర నిర్మాణం ట్రస్టులో సభ్యునిగా ఉన్నారన్న వార్తలను అమిత్ షా ఖండించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన అమిత్ షా రెండు అంశాలను స్పష్టం చేశారు. రామమందిరం నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్టులో బీజేపీ నేతలు సభ్యులుగా ఉండరని చెప్పడంతో పాటు... ప్రభుత్వం కూడా ఆలయ నిర్మాణంకు ఎలాంటి నిధులు కేటాయించదని చెప్పారు.
ఆలయ నిర్మాణం విరాళాల ద్వారానే జరుగుతుంది
ఆలయ నిర్మాణం కోసం ట్రస్ట్ సభ్యులు ప్రజల నుంచి విరాళాలు సేకరించాలని అమిత్ షా చెప్పారు. ప్రజలు ఇచ్చే విరాళాల మేరకే ఎంత తొందరగా రామమందిర నిర్మాణం పూర్తవుతుందనేది ఆధారపడి ఉంటుందని అమిత్ షా చెప్పారు. ఆలయ నిర్మాణం కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలని ఆ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మాణం జరగాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించిందని అంతవరకు మాత్రమే తమ బాధ్యతగా చేపడతామని అమిత్ షా చెప్పారు. ఇక ఇందుకోసం మూడు నెలల సమయం ఇచ్చిందన్నారు. ఈ మూడు నెలలో ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించి మార్గం సుగుమం చేస్తుందని చెప్పుకొచ్చారు అమిత్ షా.
ఆలయ నిర్మాణం కోసం 100 కోట్లు సేకరిస్తాం: వీహెచ్పీ
ఇదిలా ఉంటే రామమందిర నిర్మాణం కోసం రూ. 100కోట్లు విరాళం సేకరించాలనే టార్గెట్ను విశ్వహిందూ పరిషత్ పెట్టుకున్నట్లు ఓ కార్యకర్త చెప్పారు. ఒక్కసారి ట్రస్టు ఏర్పాటు కాగానే విరాళాల సేకరణ ప్రక్రియ ప్రారంభిస్తామని వీహెచ్పీ తెలిపింది.
ఫిబ్రవరి 2020లో ప్రయాగ్రాజ్లో వీహెచ్పీ సాధువులతో తలపెట్టదలచిన మగ్మేలాలో విరాళాలకు సంబంధించిన ప్రకటన విశ్వహిందూ పరిషత్ చేస్తుందని చెప్పారు. ఇదిలా ఉంటే సోమవారం జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా మరో నాలుగు నెలల్లో ఆకాశాన్ని తాకే ఎత్తులో రామాలయం నిర్మాణం జరుగుతుందని చెప్పారు.
ఆలయ నిర్వహణ ట్రస్టు చూసుకుంటుంది: అలోక్ కుమార్
ఓ వైపు విరాళాలు సేకరిస్తామని వీహెచ్పీ కార్యకర్తలు చెబుతుండగా సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ మాత్రం మరోలా చెబుతున్నారు. విరాళాల సేకరణకు వీహెచ్పీ ఎలాంటి ప్రకటన చేయదని చెప్పారు. దాని బదులు ట్రస్టు ద్వారా ప్రకటన వస్తుందని చెప్పారు.
అంతేకాదు రామాలయ నిర్మాణంకు ఎలాంటి విరాళాలు సేకరించకూడదని తమ కార్యకర్తలకు చెబుతానని అలోక్ కుమార్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనాలని తమ వంతు సహాయం చేసి ఇందులో భాగస్వామ్యం కావాలని అలోక్ కుమార్ చెప్పారు. అంతేకాదు రామమందిరం నిర్మాణం తర్వాత వీహెచ్పీ దీని నిర్వహణను చూసుకోదని ట్రస్టు మాత్రమే చూసుకుంటుందని చెప్పారు. మరోవైపు రామ మందిర నిర్మాణంకు ఎంత ఖర్చు అవుతుందనేది ఇప్పుడే అంచనా వేయలేమన్నారు విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు చంపత్ రాయ్. అయితే ప్రతి రామ భక్తుడు ఇందులో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
నవంబర్ 9వ తేదీన అయోధ్య రామమందిరం బాబ్రీ మసీదు భూవివాదంపై చారిత్రాత్మక తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. వివాదంగా మారిన 2.77 ఎకరాల భూమి రామ్లల్లాకే చెందుతుందని చెప్పడంతో పాటు అదే సమయంలో బాబ్రీ మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్థలాన్ని అయోధ్యలో కేటాయించాలని కేంద్రానికి సూచించింది.