కశ్మీర్లో పరిస్థితేం బాగోలేదు.. సవ్యంగా ఉందని కేంద్రం కబుర్లు చెప్తుంది... శ్రీనగర్ మేయర్ మట్టు
శ్రీనగర్ : కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుతో సుందర కశ్మీర్ నివురుగప్పిన నిప్పులా మారింది. ఇప్పటికీ భద్రతా బలగాల నీడన కశ్మీర్, లడాఖ్ ఉన్నాయి. అయితే కశ్మీర్లో జరుగుతున్న పరిణామాలను శ్రీనగర్ మేయర్, జమ్ము అండ్ కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ అధికార ప్రతినిధి జునైద్ అజీమ్ మట్టు ఖండించారు. రాజకీయ నేతలను అరెస్ట్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఒంటెద్దు పోకడలతో కశ్మీర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విమర్శించారు.
జమ్ముకశ్మీర్లో అన్ని విభాగాలు బాగున్నాయని కేంద్ర ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెప్తుందని విమర్శించారు. కశ్మీర్ నివురుగప్పిన నిప్పులా ఉందని గుర్తుచేశారు. పరిస్థితిని యదాస్థితికి తీసుకొచ్చేందుకు భారీగా బలగాలు మొహరించారని తప్పుపట్టారు. కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ నేతలను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. ఇది సరికాదని అభిప్రాయపడ్డారు. వారు ప్రజలతో ఉంటే అశాంతి చెలరేగుతుందా ? అని ప్రశ్నించారు. కశ్మీర్ కోసం, అభివృద్ధి కోసం ఇక్కడి నేతలు .. బెదిరింపులు, హింసను లెక్కచేయకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడ్డారని గుర్తుచేశారు. కానీ వారిని నిర్భందించి రాష్ట్ర విభజన చేశారని దుయ్యబట్టారు.
జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని తొలగించడం అంటే కశ్మీర్ అస్తిత్వాన్ని తొలగించడమేనని పేర్కొన్నారు. కశ్మీర్ గుర్తింపే ప్రత్యేకతను సంతరించుకుందని గుర్తుచేశారు. కశ్మీర్లో ఇక్కడి ప్రజలు హింస, భయాందోళనతో జీవిస్తారని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర విభజనతో పరిస్థితులేం మారబోవని తేల్చిచెప్పారు. కశ్మీర్ విభజించడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించడమేనని దుయ్యబట్టారు.