బోర్డర్లో చైనా కొత్త స్ట్రాటజీ... సైన్యం ఉపసంహరణకు కొర్రీలు.. ఆ షరతుకు ఓకె అంటేనే...
భారత్-చైనా సరిహద్దు ప్రతిష్టంభనకు ఎప్పుడు తెరపడుతుందో తెలియట్లేదు. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య ఏడుసార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశం జరిగినా ఆశించిన పురోగతి లభించలేదు. తాజాగా చుశూల్లో జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశంలోనూ ఇదే రిపీటైంది. సైన్యం ఉపసంహరణ గురించి భారత్ మాట్లాడుతుంటే... అందుకు సిద్దమని చెప్తూనే చైనా లేని కొర్రీలు పెడుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యం ఉపసంహరణ చేపట్టాలంటే... భారత్ తమ షరతుకు ఒప్పుకోవాలని గంభీర హెచ్చరికలు చేస్తోంది.
భారత్కు చైనా షరతు...
వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలంటే... దానికంటే ముందు భారత్ తమ షరతుకు ఒప్పుకోవాలని చైనా పట్టుబడుతోంది. తాజా కార్ప్స్ కమాండర్ సమావేశంలోనూ చైనా ఎంతసేపు దానిపైనే ఫోకస్ చేసింది. పాంగోంగ్ సరస్సుకు దక్షిణాన వ్యూహాత్మక శిఖరాలపై భారత్ మకాం వేయడాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది. ముందు ఆ శిఖరాలపై భారత స్థావరాలను ఖాళీ చేస్తేనే... సైన్యం ఉపసంహరణ ప్రక్రియ దిశగా ఆలోచిస్తామని చెబుతోంది. చైనా తీరుతో తీవ్ర అసహనానికి గురైన భారత్... మరో మాట లేకుండా ఆ షరతును ఖండించింది.
ఆ ప్రసక్తే లేదన్న భారత్...
'ఇదంతా నథింగ్... మీరు పాంగాంగ్ ఉత్తర తీరం గురించే మాట్లాడండి... లేదా దెస్పాంగ్ గురించి మాట్లాడండి... అసలు చర్చలే జరపకండి... కానీ ఆ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు. చైనా షరతును భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు...' అని భారత్ చైనాకు స్పష్టం చేసింది. గతంలో జరిగిన కార్ప్స్ కమాండర్ సమావేశంలోనూ చైనాది ఇదే తీరు. వ్యూహాత్మక శిఖరాలపై భారత్ తమ స్థావరాలను ఖాళీ చేస్తేనే.. సైన్యాన్ని ఉపసంహరించుకుంటామని చెప్పింది. అంతేకాదు,ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆరోపించింది. తాజా సమావేశంలోనూ ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఏ ఒక్క అంశం కొలిక్కి రాలేదు.
చైనాకు అసలా ఉద్దేశమే లేదు...
చైనా ఇలాంటి ప్రీ-కండిషన్స్ ముందుకు తేవడం వెనక అసలు ఉద్దేశం వేరే ఉందని భారత ఆర్మీ భావిస్తోంది. నిజానికి సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనే చైనాకు లేదని... అందుకే 1959 నాటి ఒప్పందం పేరుతో అడ్డగోలు వాదనకు తెరపైకి తెచ్చిందని భావిస్తోంది. ఆరో కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశంలోనే ఫ్రంట్ లైన్కు దళాలను పంపించవద్దని నిర్ణయం తీసుకోగా... గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరుగా ఉంది. ఇప్పటికీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ద ట్యాంకులను,దళాలను మోహరిస్తూ భారత సమీపానికి వచ్చి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. దీంతో భారత్ కూడా ధీటుగా సైన్యాన్ని మోహరిస్తూ వస్తోంది. ఇప్పటికైతే చర్చల్లో ఏదీ తేలకపోయినా... వాటి కొనసాగింపుకు మాత్రం ఇరు దేశాలు సుముఖంగానే ఉన్నాయి. దీంతో త్వరలోనే ఎనిమిదో కార్ప్స్ కమాండర్ చర్చలు జరిపే అవకాశం ఉంది.
బోర్డర్లో రొటేషన్ స్ట్రాటజీ...
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా రొటేషన్ పద్దతిని పాటిస్తున్నట్లు భారత్ చెబుతోంది. రెండు వారాలకోసారి చైనా అక్కడి దళాలను మారుస్తోందని... తద్వారా సైనికులు ఫ్రెష్ ఫీల్తో ఉండటంతో పాటు ఏ క్షణమైనా యుద్దానికి సన్నద్దంగా ఉంటారన్నది చైనా ఆలోచనగా చెబుతోంది. ఇది కేవలం ఒక్క చోటుకే పరిమితం కాదని లదాఖ్లోని అన్ని సెక్టార్లలోనూ చైనా ఇదే పద్దతిని అవలంభిస్తోందని భారత్ అంచనా వేస్తోంది. ఓవైపు భారత్... మన సైనికులు అక్కడి చలికాలాన్ని తట్టుకుని ఉండేలా ఏర్పాట్లు చేస్తూ దళాలను మోహరిస్తుంటే... చైనా మాత్రం ఇలా రొటేషన్ పద్దతిని ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.