కార్డు వద్దు.. క్యాషే ముద్దు: తగ్గిన నగదు రహిత లావాదేవీలు?!
పెద్దనోట్ల రద్దు తర్వాత.. నగరాలు, పట్టణాల్లో 40 శాతం నుంచి 80 శాతం వరకు దూసుకెళ్లిన నగదు రహిత లావాదేవీలు ఉన్నట్లుండి మళ్ళీ తగ్గుముఖం పట్టాయి.
ముంబై: పెద్దనోట్ల రద్దు తర్వాత.. నగరాలు, పట్టణాల్లో 40 శాతం నుంచి 80 శాతం వరకు దూసుకెళ్లిన నగదు రహిత లావాదేవీలు ఉన్నట్లుండి మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. కొత్త కరెన్సీ నోట్లు చలామణీలోకి వస్తున్న కొద్దీ.. ఈ కార్డు లావాదేవీలు తగ్గుతూ వస్తున్నాయి.
డిసెంబర్ చివరి వారం మొదలుకొని ఈ నెల మొదటి వారం వరకు నగదు రహిత లావాదేవీలు తగ్గుతూ వచ్చినట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి ప్రధాన కారణం మళ్ళీ వ్యవస్థలోకి నగదు రూపంలో కొత్త నోట్లు తిరిగి రావడమే అంటున్నారు.
ప్రత్యేకంగా.. ఆర్బీఐ రూ.500 నోట్లు ఎక్కువగా ముద్రిస్తుండడం వల్లనే నగదు చెలామణీ బాగా పెరిగిందని, ఫలితంగా కార్డు ద్వారా జరిపే లావాదేవీలు తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు.
నవంబరు నుంచి డిసెంబర్ ప్రారంభం వరకు ప్రజలు దాదాపు ప్రతి చెల్లింపునకు డెబిట్, క్రెడిట్ కార్డులనే ఉపయోగించారని, ఇప్పుడు మళ్ళీ అందరూ నగదు చెల్లింపులకు ఆసక్తి చూపుతున్నారని ఓ పేమెంట్ కంపెనీ ప్రతినిధి వెల్లడించడం గమనార్హం.
"నోట్లరద్దు తర్వాత చిన్న మొత్తాల చెల్లింపులు కూడా కార్డుల ద్వారానే జరిగాయి. రూ.2 వేల నోట్లకు బదులు చిల్లర తీసుకొచ్చి కొనుగోళ్ళు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ కార్డు లావాదేవీలు జరపాలనుకునే వారి ట్రెండ్ మాత్రం తగ్గలేదు. భవిష్యత్తులో మళ్ళీ నగదు రహిత లావాదేవీలు కచ్చితంగా పుంజుకుంటాయని ఆశిస్తున్నాం.." అని ఆ ప్రతినిధి పేర్కొన్నారు.