కేసు లేదు, వేధించలేదు .. ఉగ్రవాద సంస్థల ప్రేరేపితమే కారణం.. ముదసిర్ తండ్రి వెల్లడి
న్యూఢిల్లీ : ఆ యువకుడిపై ఏ కేసు లేదు, పోలీసులు వేధించలేదు. సాధారణంగా కశ్మీర్ లో యువత భద్రతా దళాలపై రాళ్లురువ్వుతుంటారు. కొందరిపై కేసులు కూడా పెడుతుంటారు. కానీ అతడిపై అలాంటి కేసు కూడా నమోదుకాలేదు. డిగ్రీ చేశాక, ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్సు చేశాడు. సెల్ టవర్ల నిర్వహణకు సంబంధించిన ఉద్యోగం చేస్తూ .. ఉగ్రవాదిగా మారాడు. టెర్రరిస్ట్ గా మారాక కూడా ఇంటికొచ్చిన కుమారుడిని ఆర్మీకి లొంగిపో అని అడిగితే .. నీ కొడుకునే కాదని వెళ్లిపోయాడు అతడే ముదసిర్ అహ్మద్ ఖాన్.
పుల్వామా దాడుల సూత్రధారి
గతనెల 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జరిగిన దాడికి ప్రధాన సూత్రధారి ముదసిర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ బాయ్. ఆత్మాహుతి దాడి చేసుకున్న ఆదిల్ అహ్మద్ కు వాహనం, పేలుడు పదార్థాలను సమకూర్చింది ముదసిరే. పుల్వామా తర్వాత దాడికి పాల్పడిన ఉగ్రవాదులను భద్రతాదళాలు ఎరివేశాయి. త్రాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముదసిర్ హతమయ్యాడు.
ఉద్యోగం నుంచి ఉగ్రవాదం వైపు ..
ముదసిర్ అహ్మద్ .. డిగ్రీ చేశాడు. తర్వాత ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసి .. దానికి సంబంధించిన ఉద్యోగం చేస్తున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఉద్యోగం నుంచి ఉగ్రవాదం వైపు మళ్లాడు. గత ఏడాది జనవరి 14న ఉద్యోగం కోసం అని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. జైషే ఉగ్రవాద సంస్థలో చేరి .. ఏకే-47 తుపాకీలతో దిగిన ఫోటోలు ఇంటర్నెట్ లో కనిపించాయి. వాటిని చూసి వ్యవసాయం చేసుకునే తల్లిదండ్రుల గుండె ఆగినంత పనైపోయంది. తర్వాత ఐదునెలలకు ఉగ్రవాదులతో కలిసి దర్జాగా ఇంటికొచ్చాడు.
మసూద్ ఇంట్రెస్టింగ్ స్టోరీ: భారత్కు ఎలా వచ్చాడు...ఎక్కడున్నాడు.. ఎలా చిక్కాడు...ఎలా విడుదలయ్యాడు..?
లొంగిపో బిడ్డా .. నీ కొడుకునే కాదయ్యా ..?
ఇంటికొచ్చిన కొడుకును చూసిన తల్లిదండ్రులు ఇకనైనా మారాలని కోరారు. ఆర్మీకి లొంగిపోతే మంచిదని సూచించారు. ఆ మంచి మాటలు చెవినపట్టని ముదసిర్ .. నీ కొడుకునే కాదు, నువ్వు నా తండ్రివే కాదని కటువుగా సమాధానం చెప్పి వెళ్లిపోయామని తండ్రి ఫరూక్ వెల్లడించారు.
ఉగ్రవాద సంస్థల ప్రేరేపితం ..
జైషే మహ్మద్ సంస్థలో ముదసిర్ ఎలా చేరాడు ? ఆయనను ఎవరూ సంప్రదించారు ? నిపుణుడైన టెక్నీషియన్ కోసం జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఎలా ఎరవేసిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సెల్ టవర్ ఉద్యోగం చేసే సమయంలోనే ముదసిర్ ను జైషే .. ప్రేరేపించిందని తెలుస్తోంది. వారి ప్రేరణతోనే ఇంటికొచ్చి వేరే ఉద్యోగమని చెప్పి చేరాడని అర్థమవుతోంది. జైషేలో చేరాక నరనరాక ఉగ్రవాద భావజాలాన్ని నింపి .. మానవబాంబుగా తయారుచేశారని నిఘావర్గాల వర్గాలు చెప్తున్నాయి.
దాడి తర్వాత కూడా సంప్రదింపులు ..
పుల్వామా సూత్రధారి ముదసిర్ అని తెలిసి .. లొంగిపోయేందుకు అతని తండ్రి ఫరూక్ ప్రయత్నించాడు. అతనితో మాట్లాడి లొంగిపోవాలని చెప్పినా .. వినిపించుకోలేదని వాపోయాడు. చివరికి త్రాల్ ఎన్ కౌంటర్ లో మాంసపు ముద్దగా మిగిలాడని విలపించాడు.