అందుకే జన్మదిన వేడుకలకు దూరంగా సోనియా గాంధీ: కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రికార్డ్
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై పెరిగిపోతున్న వేధింపులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం(డిసెంబర్ 9న) జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుకోలను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కాగా, డిసెంబర్ 9న ఆమె 73వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.
అందుకే పుట్టిన రోజు వేడుకలకు దూరం..
దేశ వ్యాప్తంగా మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలు, హింసకు నిరసనగా తన పుట్టిన రోజు వేడుకలను చేసుకోకూడదని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్లో అత్యాచార బాధితురాలిని దుండగులు కిరోసిన్ పోసి నిప్పటించారు. దీంతో ఆమె తీవ్రగాయాలపాలైంది. ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. హైదరాబాద్లో వెటర్నరీ డాక్టర్ దిశపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పటించారు. ఈ రెండు ఘటనలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ కూడా అత్యాచారాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అత్యాచారాల కేంద్రంగా భారత్ మారిపోయిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇటలీలో పుట్టిన సోనియా.. రాజీవ్ గాంధీతో ప్రేమ పెళ్లి..
ఈ నేపథ్యంలో సోనియా గాంధీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు. కాగా, సోనియా గాంధీ 1946, డిసెంబర్ 9న ఇటలీలోని లూసియానాలో జన్మించారు. ఇంగ్లాండ్లో చదువుతున్న సమయంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని సోనియా గాంధీ కలిశారు. అక్కడే ప్రేమించుకుని ఆ తర్వాత 1968లో వివాహం చేసుకున్నారు. రాజీవ్ గాంధీ హత్యానంతరం ఏడేళ్ల తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రికార్డ్..
కాంగ్రెస్ పార్టీకి అత్యంత సుదీర్ఘ కాలం అధ్యక్షురాలిగా పనిచేసిన వ్యక్తిగా సోనియా గాంధీ రికార్డు సృష్టించారు. 1998 నుంచి ఇప్పటి వరకు ఆమే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారు. 2017లో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవడంతో మళ్లీ సోనియా గాంధీనే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు.