జమిలి ఎన్నికలకు ఛాన్సే లేదు..తేల్చి చెప్పిన ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్
దేశంలోని అన్ని రాష్ట్ర అసెంబ్లీలకు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరపాలన్న కేంద్రం ఆలోచన ఆచరణ సాధ్యం కాదని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ అన్నారు. అటు రాష్ట్ర అసెంబ్లీకి ఇటు పార్లమెంటుకు ఎన్నికలు జరగాలంటే దాని వెనక చట్టపరమైన, న్యాయపరమైన అంశాలు చాలా ఉన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నెల మొదట్లో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి ఒకేదేశం ఒకే ఎన్నిక విధానంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని అమిత్ షా ఆ లేఖలో వివరించారు.
జమిలీ ఎన్నికలపై వివరణ ఇస్తూ అమిత్ షా ఓపీ రావత్కు ఎనిమిది పేజీలతో కూడిన లేఖ రాశారు. లోక్సభ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల మధ్య జరుగుతాయని... ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్, మిజోరాం రాష్ట్ర అసెంబ్లీఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అయితే అన్ని రాష్ట్ర అసెంబ్లీలకు, పార్లమెంటు స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల అటు సమయం ఇటు ఖర్చు ఆదా అవుతుందని అమిత్ షా తన లేఖలో వివరించారు. ప్రభుత్వం కూడా ఇదే అభిప్రాయంతో ఉండి జమిలికే మద్దతు తెలుపుతోందని షా వివరించారు. 2019లో జరిగే పార్లమెంటు ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను రెండు దఫాలుగా నిర్వహించాలని లాకమిషన్ రికమెండ్ చేసింది.
జమిలి ఎన్నికలపై విపక్షపార్టీలను కన్విన్స్ చేసేందుకు ప్రభుత్వం ఎంత ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, డీఎంకే, తెలుగదేశం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమని వాదించాయి. అది ఆచరణ సాధ్యం కాదని పేర్కొన్నాయి. అంతేకాదు కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసి లోక్సభను రద్దు చేసి ఈ ఏడాది చివర్లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటే సాధారణ ఎన్నికలు జరుగుతాయనే ప్రకటన ప్రధాని మోడీ చేయాలని సవాల్ విసిరింది. మరోవైపు ఎన్డీఏలో చేరిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం జమిలీ ఎన్నికలు ఐడియా మంచిదే అయినప్పటికీ ఇప్పుడు అది ఆచరణ సాధ్యం కాదని చెప్పారు.