మార్పుల్లేవ్: హెచ్1బీ వీసాపై అమెరికా, టెక్కీలకు తీపి కబురు
Recommended Video
కోల్కతా: భారతీయ ఐటీ కంపెనీలతోపాటు అమెరికాకు వెళ్లాలనుకునే భారతీయులకు ఇది ఖచ్చితంగా శుభవార్తే. హెచ్-1బీ వీసాపై కఠినతరమైన నిబంధనలు తీసుకురాబోతున్నారంటూ తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తిన క్రమంలో అమెరికా తాజా ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రస్తుతమున్న హెచ్-1బీ వీసా విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని అమెరికా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ముందస్తు ఉన్న విధానమే కొనసాగుతుందని స్పష్టం చేసింది. దక్షిణ ఆసియాకు చెందిన డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ థామస్ వాజ్డ ఈ విషయాన్ని వెల్లడించారు.
మార్పుల్లేవ్..
‘అమెరికాలోని హెచ్-1బీ వీసా విధానపు చట్టంలో ఎలాంటి మార్పు లేదు. హెచ్-1బీ వీసా విధానాన్ని సమీక్షించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ' అని ఆయన తెలిపారు. బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మెంబర్ల ఇంటరాక్టివ్ సెషన్లో వాజ్డ ఈ విషయాన్ని తెలిపారు.
గత విధానమే..
‘చట్టంలో చాలా మార్పులు తీసుకురావాలని అనుకున్నారు. చాలా కేసుల్లో మార్పులు తీసుకురావాల్సినవసరం కూడా ఉంది. కానీ, హెచ్-1బీల్లో మార్పుల కొరకు ఇప్పటివరకు ఎలాంటి చట్టాన్ని తీసుకురాలేదు. గతంలో ఉన్నదే కొనసాగుతోంది' అని వాజ్డ తెలిపారు.
ఆ ప్రకటనతో ఆందోళన
అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత హెచ్-1బీ, ఎల్1 వీసాల్లో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఈ ప్రకటనతో ఐటీ కంపెనీలు తీవ్రంగా ఆందోళన చెందాయి. వ్యయాలను తగ్గించుకోవడానికి పెద్ద మొత్తంలో ఐటి సిబ్బందిని హెచ్-1బీ వీసాలపై భారత కంపెనీలు అమెరికాకు పంపుతున్న విషయం తెలిసిందే.
అతిపెద్ద మార్కెట్
అంతేగాక మన దేశ కంపెనీల ఐటీ ఎగుమతులకు కూడా అమెరికానే అతిపెద్ద మార్కెట్. దీంతో ఆ ప్రకటనతో దేశీయ ఐటీ కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. హెచ్-1బీ వీసా, ఎల్1 వీసాల్లో కఠినతరమైన నిబంధనలపై భారత్ ప్రతినిధులు, అమెరికా ప్రతినిధులతో చర్చించారు. ఈ నేపథ్యంలో అమెరికా తాజా ప్రకటన ఐటీ కంపెనీల్లోనూ, ఉద్యోగుల్లోనూ ఆనందం నింపినట్లయింది.