చైనాకు భారత్ మళ్లీ తలుపులు తెరుస్తుందా... ఆ 45 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచన నిజమేనా?
భారత్-చైనా సరిహద్దులో ఇటీవలే తొలి దశ సైనిక బలగాల ఉపసంహరణ పూర్తయిన సంగతి తెలిసిందే. సరిహద్దు వెంబడి దాదాపు 10 నెలల పాటు నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరదించేలా ఇరు దేశాలు పరస్పర సహకారంతో సైన్యం ఉపసంహరణ ప్రక్రియను చేపట్టాయి. దీంతో సరిహద్దు ఉద్రిక్తతలకు ఇక తెరపడినట్లేనన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్లో చైనా వాణిజ్యం పట్ల కేంద్రప్రభుత్వం తమ వైఖరిని మార్చుకుంటుందా అన్న చర్చ జరుగుతోంది. చైనా కయ్యానికి కాలు దువ్వడం పక్కనపెట్టడంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో డ్రాగన్కు భారత్ మళ్లీ తలుపులు తెరుస్తుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఆ 45 కంపెనీలకు ఎఫ్డీఐలకు అనుమతిస్తారా?
చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో డ్రాగన్ పట్ల విధించిన ఆంక్షలను భారత్ సడలించవచ్చునని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. సరిహద్దులో ఉద్రిక్తతలకు పూర్తిగా తెరపడిన తర్వాత చైనాకు చెందిన 45 పెట్టుబడి ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇందులో గ్రేట్ వాల్ మోటార్,SAIC మోటార్ కార్ప్ వంటి కంపెనీలు ఉన్నట్లు తెలిపింది. మిగతావాటిల్లో జాతీయ భద్రతపై ఎటువంటి ఎఫెక్ట్ చూపించని మాన్యుఫాక్చరింగ్ రంగానికి చెందిన ప్రతిపాదనలు ఉన్నట్లు వెల్లడించింది.
మొత్తం 150 పెట్టుబడి ప్రతిపాదనలు..
చైనా నుంచి మొత్తంగా 2బిలియన్ డాలర్ల పైచిలుకుకు సంబంధించిన 150 పెట్టుబడి ప్రతిపాదనలు లైన్లో ఉన్నట్లు రాయిటర్స్ తెలిపింది. చైనాతో చెడిన సంబంధాల కారణంగా హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తూ భారత్లోకి ప్రవేశించాలనుకున్న జపాన్,అమెరికా కంపెనీలకు కూడా బ్రేక్ పడినట్లు చెప్పింది. ఇలాంటి ప్రతిపాదనలన్నింటిపై హోంమంత్రిత్వ శాఖ నేత్రుత్వంలో అంతర్గత పరిశీలన చేపట్టి... వాటిని ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఆ ప్రచారాన్ని ఖండించిన కేంద్రం...
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో భారత్ తన విధానాన్ని మార్చుకునే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అందులో ఏమాత్రం నిజం లేదని... తమ పాలసీలో ఎటువంటి మార్పులు ఉండవని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటికైతే తమ పాలసీలో ఎటువంటి మార్పులు ఉండబోవని... సమీప భవిష్యత్తులోనూ అలాంటి మార్పులకు ఎటువంటి ప్రణాళికలు చేయలేదని తెలిపింది. అయితే హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న జపనీస్ కంపెనీతో పాటు,మరో రెండు కంపెనీలకు భారత్లో ఎఫ్డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
ఆ 3 కంపెనీలకే గ్రీన్ సిగ్నల్...
భారత్లో ఎఫ్డీఐలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కంపెనీల్లో నిప్పాన్ పెయింట్స్-జపాన్,సిటిజెన్ వాచెస్,నెట్ప్లే కంపెనీలు ఉన్నాయి. భారత్లో పెట్టుబడులకు ఈ మూడు కంపెనీలకు అనుమతి ఇవ్వడానికి సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడానికి ఎటువంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. జనవరి 22న జరిగిన సమావేశంలో దీనిపై చర్చించి ఫిబ్రవరి 5న ఈ కంపెనీలకు అనుమతించామని చెప్తున్నారు. సరిహద్దులో సైన్యం ఉపసంహరణ ప్రక్రియపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ ఫిబ్రవరి 11న ప్రకటన చేశారని... అంతకన్నా ముందే వీటికి క్లియరెన్స్ ఇచ్చామని చెప్తున్నారు.