కేంద్ర బడ్జెట్ 2019 : రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను లేదు...
ఢిల్లీ : వేతన జీవి ఆశగా ఎదురుచూస్తున్న ఆదాయపన్ను విషయంలో కేంద్రం కాస్త నిరాశే మిగిల్చింది. వ్యక్తిగత ఆదాయపు పన్నులో ఎలాంటి మార్పు చేయలేదని ప్రకటించింది. రూ. 5 లక్షల వరకు సంవత్సర ఆదాయం కలిగిన వారెవరూ ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరంలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించింది. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఈ విషయాన్ని ప్రస్తవించిన కేంద్రం తాజాగా మరోసారి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది.
కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల కోట్ల మంది మధ్య తరగతి ప్రజలు పన్ను భారం నుంచి మినహాయింపు పొందనున్నారు. అయితే రూ.2కోట్లకుపైగా వార్షికాదాయం ఉన్నవారికి 3శాతం, రూ.5కోట్లకుపైగా వార్షికాదాయం కలిగిన వారికి 7 శాతం సర్ఛార్జ్ విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఆదాయపన్ను రిటర్నులు సమర్పించే సమయంలో పాన్ కార్డు లేనివారికి ఊరట ఇచ్చింది. పాన్ కార్డు లేకపోయినా కేవలం ఆధార్ కార్డు ద్వారా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తద్వారా రిటర్న్స్ దాఖలు ప్రక్రియ మరింత సులభతరం చేయనున్నట్లు చెప్పారు. 120 కోట్లకుపైగా భారతీయులు ఆధార్ కార్డు కలిగి ఉన్నందున పన్ను చెల్లింపుదారుల సౌకర్యం కోసం ఈ ప్రతిపాదన చేసినట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుకు తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీలో రూ.1.5లక్షలకు కేంద్రం మినహాయింపు నిచ్చింది. ఏడాదిలో కోటి రూపాయలకు పైగా నగదు విత్ డ్రా చేస్తే 2శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది.