పీసీసీల కొనసాగింపు: ఆశావాహులపై రాహుల్ నీళ్లు, డీకే, రేవంత్కూ నిరాశే!
న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని సీనియర్లు భావించారు.
అన్నిరాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కమిటీలు కొనసాగించాలని రాహుల్ గాంధీ నిర్ణయించారు. ఈ మేరకు ఏఐసీసీ మీడియాకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఎటువంటి మార్పుల్లేవని ఏఐసీసీ స్పష్టం చేసింది.
ఆశావాహులపై నీళ్లు
కాగా, రాహుల్ గాంధీ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లోని ఆశావాహుల్లో నిరాశనే కలిగించిందని చెప్పవచ్చు. ఏపీలో ఏమో గానీ, తెలంగాణలో మాత్రం పీసీసీకి తీవ్రమైన పోటీ ఉండటం గమనార్హం.
మొదటి వరుసలో డీకే అరుణ
రాహుల్ నిర్ణయం నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. అయితే, ఈ పదవిపై కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. అదిష్టానం ఆ పదవి ఇస్తే చేపడతానని ఆమె పలుమార్లు మీడియాకు తెలిపారు.
కోమటిరెడ్డి కూడా పావులు
కాగా, తెలంగాణ పీసీసీ పదవిని కోరుకున్న వారిలో మరో మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటికే ఆయన పీసీసీ పదవి కోసం పావులు కదిపినట్లు వార్తలు వచ్చాయి.
రేవంత్కు ఆశలు లేనట్లే
వీరిద్దరి బాటలోనే ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా తనకు ఏదో కీలక పదవి వస్తుందని ఆశించినట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయంతో రేవంత్ కూడా నిరాశ తప్పలేదని తెలుస్తోంది.
అక్కడ ఇక రఘువీరానే..
ఇక ఏపీ విషయనికొస్తే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రఘువీరా రెడ్డి మరికొంత కాలం ఆ పదవిలో ఉండనున్నారు. అయితే, తెలంగాణలో మాదిరి ఏపీలో ఈ పదవికి పెద్దగా పోటీ ఉండకపోవడం గమనార్హం.