కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి ఇతర రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించడం లేదు : ఆప్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా ఇతర రాజకీయ నాయకులను ఆహ్వానించడం లేదని ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ తెలిపారు. ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ ప్రజలందరినీ ఆహ్వానించామని ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా చెప్పారు. ఢిల్లీలోని ప్రతీ ఒక్కరూ రామ్లీలా మైదాన్కి వచ్చి కేజ్రీవాల్ను ఆశీర్వదించాలన్నారు. నిజానికి కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించాలని ఆప్ భావించింది. కానీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంది.
Recommended Video
కాగా, ఈ నెల 16న ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఇక కేబినెట్ విషయానికొస్తే.. దాదాపుగా పాత కేబినెట్నే మళ్లీ కొనసాగించే అవకాశాలున్నాయి. దీంతో గత కేబినెట్లోని మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, ఖైలాశ్ గెహ్లోత్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్రపాల్ గౌతంలకు మరోసారి మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇక మంత్రి పదవులు ఆశించిన మహిళా ఎమ్మెల్యే అతిషిని,యువ ఎమ్మెల్యే రాఘవ్ చద్దాలకు నిరాశ తప్పలేదు. వీరిద్దరికి మంత్రి పదవులు దక్కుతున్నాయన్న ఊహాగానాలు వినిపించినప్పటికీ.. చివరకు కేజ్రీవాల్ పాత మంత్రులనే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే,ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలే నిజమైన సంగతి తెలిసిందే. 2015లో 28 సీట్లు,2015లో 67 సీట్లు దక్కించుకున్న ఆప్.. తాజా ఎన్నికల్లో 62 సీట్లను గెలుచుకుని వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక బీజేపీ కేవలం 8 స్థానాలకు పరిమితం కాగా.. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది.