బిహార్లో ఎటూ తేలని సీట్ల పంచాయితీ... చిక్కంతా చిన్న పార్టీలతోనే.... కుదురకపోతే పొత్తులో ఆ 3 పార్టీ
గత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్,ఆర్జేడీ,ఆర్ఎల్ఎస్పీ,హెచ్ఏఏం తదితర ప్రాంతీయ పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి పొత్తులు రిపీట్ అవుతాయా కాదా అన్న దానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే జిల్లా స్థాయి వర్చువల్ ర్యాలీలతో ప్రచార పర్వానికి తెరలేపింది.
కుదరని ఏకాభిప్రాయం...
ఉపేంద్ర కుష్వాహ నేత్రుత్వంలోని ఆర్ఎల్ఎస్పీ,ముకేష్ సాహ్ని నేత్రుత్వంలోని వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ(VIP)లకు సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్,ఆర్జేడీ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు. కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న ప్రకారం... చిన్న పార్టీలకు సీట్ల కేటాయింపుపై ఆర్జేడీ ఏమాత్రం సుముఖంగా కాదు. పైగా ఆ పార్టీలను ఆర్జేడీ లేదా కాంగ్రెస్ పార్టీల గుర్తులపై పోటీ చేయాలని ఆర్జేడీ చెబుతోంది. చిన్న పార్టీలతో పొత్తులు వారి కుల ఓటు బ్యాంకును పూర్తిగా కూటమి వైపు మళ్లించలేవన్నది ఆర్జేడీ వాదన. అయితే ఎన్డీయే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవద్దన్న ఉద్దేశంతో కాంగ్రెస్ లేదా ఆర్జేడీ గుర్తులపై చిన్న పార్టీలు పోటీ చేస్తే మంచిదని ఆర్జేడీ సూచిస్తోంది.
70 పైచిలుకు స్థానాల్లో కాంగ్రెస్...?
తమ పార్టీ నేతలు కాంగ్రెస్ 70 పైచిలుకు స్థానాల్లో పోటీ చేస్తుందని తమతో చెబుతున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు వెల్లడించారు. అయితే ఏయే స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతారన్న దానిపై స్పష్టత లేదన్నారు. ఇప్పటికైతే వర్చువల్ ర్యాలీలు సజావుగానే సాగుతున్నప్పటికీ... పొత్తులు,సీట్ల కేటాయింపు విషయంలో స్పష్టత రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆర్జేడీ,కాంగ్రెస్,సీపీఐ(ఎంఎల్) పొత్తుపై ఈ మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ... చిన్న పార్టీలను కలుపుకుపోవడం పైనే ఇంకా ఎటూ తేల్చలేదని ఆర్జేడీ నేతలు చెబుతున్నారు.
చిన్న పార్టీలతో చిక్కు...
అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ ఫైట్ లేదా హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నందునా ఎన్నికలకు ముందే పొత్తులు అవసరమని మరో సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్,సీపీఐ(ఎంఎల్),ఆర్జేడీ కలిసి బీజేపీని నిలువరించగలయన్న నమ్మకం ఉందని.... అయితే ఎటొచ్చి చిన్న పార్టీలతోనే చిక్కు వచ్చి పడిందని అన్నారు. చిన్న పార్టీల నేతలు ప్రలోభాలకు లొంగకుండా ఉంటారా... ఒకవేళ ఎన్నికల్లో తక్కువ సీట్లు సాధిస్తే... ఆ తర్వాత పార్టీని అంటిపెట్టుకుని ఉంటారా అన్నది సందేహాస్పదంగా ఉందన్నారు.
కలిసొస్తే మంచిదంటున్న సీనియర్ నేతలు...
ఆర్ఎస్ఎల్పీ,వీఐపీ పార్టీలు సరైన డిమాండ్లతో ముందుకొచ్చి పొత్తుకు అంగీకరిస్తే బిహార్ ప్రజల్లోకి కూటమిపై పాజిటివ్ సంకేతాలు వెళ్తాయన్నారు. 'ఇదో క్లిష్టమైన సమస్య. కొన్ని ప్రాంతాల్లో ఆర్జేడీ లాంటి పెద్ద పార్టీలకు ఓట్లు రాని చోట చిన్న పార్టీలకు ఓట్లు రావచ్చు. అయితే జీతన్ రామ్ మాంఝీ లాంటి నేతలు తమ పార్టీలకు ఎక్కువ సీట్లు ఆశిస్తుండటం పొత్తును విచ్చిన్నం చేస్తుంది. పరిస్థితులను అర్థం చేసుకుని పెద్ద పార్టీలు,చిన్న పార్టీలు జతకడితే మంచి ఫలితం ఉంటుంది.' అని కూటమి ఏర్పాటుకు మద్దతు తెలుపుతున్న మరో సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.
చిన్న పార్టీల గొంతెమ్మ కోర్కెలు...
ప్రస్తుత పరిస్థితుల్లో బిహార్ ప్రజలు నితీశ్కు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని.... అది ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవే అని ఆ పార్టీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. తేజస్వి మాత్రమే నితీశ్ కుమార్ను ఎదుర్కొనగలరని చెప్పారు. చిన్న పార్టీలు అతిగా ఆశించడం పక్కనపెట్టి... కాస్త రాజీ ధోరణితో కలిసొస్తే అందరికీ మంచి జరుగుతుందన్నారు. కానీ వీఐపీ లాంటి పార్టీలు 25-30 సీట్లు డిమాండ్ చేస్తున్నాయని,డిప్యూటీ సీఎం పదవిని కూడా డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. అటు ఆర్ఎస్ఎల్పీ కూడా తమకు వీఐపీ కంటే ఎక్కువ సీట్లు కావాలని చెబుతోందన్నారు. చిన్న పార్టీలు ఇదే ధోరణి కొనసాగిస్తే.... వాటిని పక్కనపెట్టి ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్షాలు కలిసి ముందుకెళ్లే అవకాశం ఉందన్నారు.