నా పని నేను చేశా, అంతే: మన్మోహన్ నో కామెంట్
న్యూఢిల్లీ: తన అలసత్వం వల్లనే 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణాలు జరిగాయని ‘కాగ్' మాజీ చీఫ్ వినోద్ రాయ్ చేసిన విమర్శలపై స్పందించేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిరాకరించారు. ‘‘నా పని నేను చేశా. ఇతరులు ఏమి రాశారనే దానిపై నేను చెప్పేదేమీ లేదు'' అన్నారు.
తన కుమార్తె దమన్ సింగ్ రాసిన ‘స్ర్టిక్ట్లీ పర్సనల్ : మన్మోహన్ అండ్ గురుచరణ్' పుస్తకానికి సంబంధించి ఆదివారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మన్మోహన్ సింగ్ను మీడియా ప్రతినిధులు వినోద్ రాయ్ విమర్శలపై ప్రశ్నించారు.
2జీ స్పె క్ట్రం, బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని తెలిసినా మన్మోహన్ సింగ్ పట్టించుకోలేదని కాగ్ మాజీ చీఫ్ ఆరోపించారు. మన్మోహన్ సింగ్ కల్పించుకుని ఉంటే అసలు ఈ కుంభకోణాలు చోటు చేసుకుని ఉండేవే కావని తన పుస్తకంలో అన్నారు.
మన్మోహన్ సింగ్పై కాగ్ మాజీ చీఫ్ చేసిన ఆరోపణలపై మాట్లాడేందుకు ఆయన తనయ దమన్ సింగ్ కూడా నిరాకరించారు. తన పుస్తకంలో తల్లి దండ్రులకు సంబంధించి అనేక వివరాలు వెల్లడించిన దమన్ సింగ్, ప్రధానిగా మన్మోహన్ సింగ్ పదేళ్ల జీవితానికి సంబంధించి మాత్రం ఎలాంటి వివరాలూ ఇవ్వలేదు.