అవిశ్వాస తీర్మానంపై ఇదీ లెక్క: ఎవరి బలమెంత? టీడీపీ ముందు జాగ్రత్త!
న్యూఢిల్లీ: తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. దీంతో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అందరికీ దాదాపు అర్థమయింది. అయితే, ఇక్కడ ఒక్కటే ప్రశ్న ఉదయిస్తుంది. ఏపీకి ఇచ్చిన నిధులతో టీడీపీని బీజేపీ ఇరుకున పెడుతుందా? లేక కమలం పార్టీని తెలుగుదేశం కార్నర్ చేస్తుందా? ఇది రేపు తేలిపోనుంది.
దెబ్బకు 4 పిట్టలా, సెల్ఫ్ గోలా? పవన్ ఆయుధంతో ఆయనే టార్గెట్, జగన్కు ఛాన్స్ మిస్
టీడీపీ తమకు కేటాయించిన 13 నిమిషాలతో పాటు మరికొంత సమయం అదనంగా మాట్లాడి కేంద్రం నుంచి వచ్చిన నిధులు, నెరవేరని హామీలపై మాట్లాడనుంది. ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో చట్టంలో ఏముంది, ఏమిచ్చాం, నాటి కేంద్ర ప్రభుత్వం ఎంత సమయంలో చేయమంటే తాము ఎంత ముందుగా చేశాం.. ఏఏ పనులు ఎంత వరకు వచ్చాయని బీజేపీ చెప్పనుంది.
మోడీ ప్రభుత్వానికి నష్టం లేదు.. మిగిలింది అదే
అవిశ్వాస తీర్మానం వల్ల మోడీ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు. కానీ విభజన హామీలు తదితర అంశాలపై ఎవరు ఏం చేశారు, ఎవరు అవాస్తవాలు చేశారనే విషయం వెల్లడి కానుంది. ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న ఇదే. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్, డీఎంకే వంటి పార్టీలు టీడీపీకి జత కలవనున్నాయి.
సభలో పార్టీల బలాబలాలు
లోకసభలో 544 స్థానాలు ఉన్నాయి. రాజీనామా చేసిన వారి విషయాన్ని తప్పిస్తే నేటి వరకు 533 మంది ఉన్నారు. బుధవారం మరో ఇద్దరి రాజీనామాలు ఆమోదించారు. మెజార్టీకి 268 మంది వరకు అవసరం. ఎన్డీయేకు 313 నుంచి 314 మంది బలం ఉంది. అందులో బీజేపీకి 273 స్థానాలు సొంతగా ఉన్నాయి. కాంగ్రెస్, దాని మిత్రపక్షాల బలం 64 వరకు ఉంది. తృణమూల్ కాంగ్రెస్ బలం 34, అన్నాడీఎంకేకు 37, బీజేడీ 20, టీడీపీకి 16 మంది బలం ఉంది. మొత్తంగా చూస్తే ఎన్డీయేకు 314 మంది, విపక్షాలు.. అంటే అవిశ్వాసానికి మద్దతిచ్చే పార్టీల ఎంపీల సంఖ్య 150కి పైగా, ఇప్పటి వరకు తమ వైఖరి చెప్పనివి లేదా తటస్థంగా ఉండే వారి సంఖ్య 70కి పైగా ఉంది.
ఎన్డీయే బలం
ఎన్డీయే విషయానికి వస్తే... పార్టీల పరంగా బలం చూసుకుంటే బీజేపీకి 273, శివసేన 18, లోకజనశక్తి 6, శిరోమణి అకాలీదళ్ 4, ఆర్ఎల్ఎస్పీ 3, అప్నాదళ్ 3, జేడీయు 2, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 1 ఉన్నాయి. అన్నాడీఎంకేతో పాటు మరికొందరి మద్దతు ఉంటే 330కి పైగా మోడీకి అనుకూలంగా ఉంటుంది.
విపక్షాల బలం
విపక్షాల బలం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 48 సీట్లు, టీఎంసీకి 34, టీడీపీ 16, సీపీఎం 9, ఎన్సీపీ 7, ఎస్పీ 7, ఆమ్ ఆద్మీ పార్టీ 4, ఆర్జేడీ 4 సీట్లతో ఉంది. ఒకటి నుంచి మూడు పార్టీ సీట్లు ఉన్న మజ్లిస్, జేఎంఎం, ఐయూఎంఎల్, పీఎంకే వంటి పార్టీలకు చెందిన మరో 22కు పైగా స్థానాలు ఉన్నాయి. బీజేడీ, టీఆర్ఎస్ వంటి కొన్ని పార్టీలు వైఖరి చెప్పాల్సి ఉంది. కాగా, ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది లేదు కాబట్టి టీడీపీ ముందే ఓ మాట చెబుతోంది. తమ ఉద్దేశ్యం ప్రభుత్వాన్ని కూలదోయడం కాదని, విభజన అంశాలను సభలో చర్చించడం ద్వారా కేంద్రం స్పందించేలా చేయడమని చెబుతున్నారు. ప్రభుత్వాన్ని కూల్చడం కాదని చెప్పడం ద్వారా టీడీపీ ముందు జాగ్రత్తగా ఒకింత ముందే చేతులెత్తేసినట్లే అంటున్నారు.