జయలలిత బుగ్గపై చుక్కలు... పొంతన లేని డాక్టర్ల సమాధానాలు
జయలలిత బుగ్గలపై ఉన్న చుక్కల గురించి లండన్ డాక్టర్ బీలే మాట్లాడుతూ తీవ్రంగా జబ్బుపడ్డ రోగులకు బుగ్గలపై అలాంటి చుక్కలు వస్తాయన్నారు..
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ అనుమానాలను నివృత్తి చేసేందుకు లండన్ కు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బీలే, అపోలో ఆసుపత్రి వైద్యులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.
తమిళనాడు సర్కారు ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ లో వైద్యులకు ఎదురైన ప్రధాన ప్రశ్న.. జయలలిత బుగ్గలపై ఉన్న చుక్కల గురించే. ప్రజల సందర్శనార్థం జయలలిత భౌతిక కాయాన్ని రాజాజీ హాల్ లో ఉంచిన సందర్భంలో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి.
ముఖ్యంగా జయలలిత భౌతికకాయం మారిపోయిన తీరు, ఆమె బుగ్గపై ఉన్న నాలుగు చుక్కలు అనేక అనుమానాలకు తావిచ్చాయి. దీనికితోడు జయలలిత రెండు కాళ్లు తొలగించారని, అసలు ఆమె ఎప్పుడో చనిపోయారని, ఈ విషయాన్ని దాచిపెట్టి.. ఆమె భౌతిక కాయం కుళ్లిపోకుండా ఉండేందుకు తీసుకున్న చర్యల వల్లే ఆమె బుగ్గపై ఆ చుక్కలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో వదంతులు గుప్పుమన్నాయి.
ఈ అనుమానాలపై ప్రెస్ మీట్ లో పత్రికా విలేకరులు అడిగిన ప్రశ్నలకు లండన్ డాక్టర్ బీలే స్పందించారు. జయలలిత కాళ్లు తొలగించలేదని, ఎలాంటి ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేయలేదని తెలిపారు. తీవ్రంగా జబ్బుపడ్డ రోగులకు బుగ్గలపై అలాంటి చుక్కలు వస్తాయని వివరించారు.
మద్రాస్ మెడికల్ కాలేజీ అనాటమీ డైరెక్టర్ డాక్టర్ సుధా శేషియన్ మాట్లడుతూ.. జయలలిత భౌతికకాయాన్ని భద్రపరిచే విషయంలో సాధారణ పద్ధతినే పాటించినట్లు చెప్పారు. ఆమె భౌతికకాయంలోకి ఎంబ్లేమింగ్ ప్లూయిడ్స్ ఎక్కించామని, ఎలాంటి లీక్ కూడా జరగలేదని వివరించారు.
వెంటిలేటర్ పై ఉంచడం వల్ల జయలలిత పెదవులు ఉబ్బి ఉంటాయని, ట్రేకియాటమీ (శ్వాసలో అడ్డంకులు తొలగించే విధానం) చేసే క్రమంలో ఆమె బుగ్గపై ఆ చుక్కలు వచ్చి ఉంటాయని పేర్కొన్నారు.
అయితే జయలలిత బుగ్గపై చుక్కల గురించి వైద్యులు ఇచ్చిన వివరణలకు పొంతన లేకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగుతున్నాయి. జయలలిత మృతిపై సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసిన సమయం గురించి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇన్నాళ్లూ ప్రజల్లో నెలకొని ఉన్న ఈ సందేహాలకు డాక్టర్లచే ఇప్పటి వరకు సమాధానాలు ఇప్పించని ప్రభుత్వం.. తీరా తమిళనాడు కొత్త సీఎంగా శశికళను ఎంచుకున్న మర్నాడే ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించి మరీ డాక్టర్లతో చెప్పించడం కూడా అనేక అనుమానాలకు, విమర్శలకు తావిస్తోంది.