ఏదో చెప్తారనుకుంటే ఏమో చెప్పారు..పీఎం ప్రెస్ మీట్ లో స్పష్టత మిస్..లాక్డౌన్ పట్ల సీరియస్ నెస్ ఏది.?
ఢిల్లీ/హైదరాబాద్ : దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ జోరు కొనసాగిస్తోంది. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికి పాజిటీవ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నాయి. ప్రపంచ కరోనా బాదిత దేశాల్లో భారత దేశం నాలుగవ స్తానానికి ఎగబాకిందంటే పరిస్థితి ఎంత భయానకంగా రూపాంతరం చెందిందో అర్థమవుతోంది. లాక్డౌన్ ఆంక్షలనుండి కొన్ని మినహాయింపులు ప్రకటించిన దగ్గర నుండి కేసులు అనూహ్యంగా పెరుగుతున్నట్టు వైద్య నిపుణులు నిర్దారిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి తరుణంలో దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ మరో సాహసోపేత నిర్ణయం తీసుకుంటారని అందరూ బావించారు.
కరోనా వ్యాప్తి పట్ల భయం పోయింది..
కాని మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగం సాదాసీదాగా సాగిందనే చర్చ జరుగుతోంది. అంతే కాకుండా ఆర్థిక ప్యాకేజీ మినహ మిగతా అంశాలపట్ల ప్రధాని పెద్దగా దృష్టి కేంద్రీకరించలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక రాష్ట్రాల్లో నెలకొన్న కరోనా వైరస్ పరిస్ధితుల తీవ్రతను బట్టి సొంత నిర్ణయాలు తీసుకోవచ్చని, లాక్డౌన్ ఆంక్షల అమలు లేదా సడలింపుల అంశంలో నాలుగు రోజుల్లో తమ తమ అభిప్రాయాలు చెప్పాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధాని కోరడం మరింత ఆసక్తికరంగా మారింది. అంటే రాష్ట్రాల్లో కరోనా వైరస్ కట్టడికోసం స్వీయ నిర్ణయాలు తీసుకునే స్వేఛ్చ ఆయా రాష్ట్రాలకు ఒదిలేస్తున్నట్టు పరోక్షంగా మోదీ స్పష్టం చేసారు.
లాక్డౌన్ ఆంక్షల పట్ల తగ్గిన సీరియస్ నెస్..
ఎక్కడ శుభోదయం అయినా పరవాలేదు గాని అస్తమయం మాత్రం పడమరలోనే కావాలి. అంటే ఏ కార్యక్రమానికైనా శుభం కార్డు మాత్రం ఘనంగా ఉండాలి. చివరి పంచ్ లో ఉన్న కిక్కే వేరబ్బా అన్నట్టు ముగింపులుండాలనేది దేశ ప్రజల భావన. కరోనా కట్టడి అంశంలో పక్కా స్పష్టతతో వ్యవహరించిన భారతదేశం, రాను రాను పట్టు కోల్పోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా వైరస్ కట్టడి విషయంలో రాజీ లేకుండా లాక్డౌన్ విధించారు. కరోనా వైరస్ ప్రభావం నుండి దేశ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు లాక్డౌన్ విధించి ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం.
పెరుగుతున్న కరోనా కేసులు..
మూడు సార్లు లాక్డౌన్ లు విధించి కఠిన ఆంక్షలు అమలు చేసినా దాని లక్ష్యం నెరవేరకుండా కేంద్ర ప్రభుత్వం మెతకమడిందనే చర్చ జరుగుతోంది. అందుకు మంగళవారం ప్రధాని మోదీ చేసిన ప్రసంగమే ఉదాహరణగా చెప్పుకొస్తున్నారు దేశ ప్రజలు. కరోనా పాజిటీవ్ కేసుల ప్రభావం అంతగా లేనపుడు లాక్డౌన్ ఆంక్షలు అమలు చేసి, భారీగా కేసులు నమోదవుతున్నపుడు లాక్డౌన్ ఆంక్షలు సడలించడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు దేశంలో ఉదృతమవుతున్న కరోనా పాజిటీవ్ కేసులను పరిగణలోకి ఎందుకు తీసుకోవడంలేదని, మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయంలో ఉదాసినంగా వ్యవహరించడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
Recommended Video
మోదీ ఉదాసీనత..
అంతే కాకుండా కరోనా వ్యవహారం పట్ల నాలుగు రోజుల్లో తమ ప్రణాళిక ఏంటో తెలియజేయాలని ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేయడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇక వలస కూలీల అంశంలో తలెత్తుతున్న విమర్శలకు గాని, ఇతర ఉత్పాదకత, అనుత్పాదకత రంగాల్లో ఆర్ధికంగా ఏర్పడ్డ స్తబ్దతనుండి వెసులబాటు కల్పించుకోవడం కోసం ఓ వజ్రాయుధాన్ని వదిలారు ప్రధాని మోదీ. కొన్ని సంపన్న దేశాలతో సమానంగా 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. అయితే మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వల్ల కరోనా కట్టడి అవుతుందా అని కొన్ని వర్గాల ప్రశ్నిస్తున్నాయి.