ఏపీ, తెలంగాణతోపాటు 20 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్: ఆ ఐదు రాష్ట్రాల్లోనే 80శాతానికిపైగా..
న్యూఢిల్లీ: కరోనావైరస్ కేసులు గత కొద్ది రోజులుగా దేశంలో పెరుగుతున్నాయి. అయితే, దేశ వ్యాప్తంగా కేవలం ఐదు రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెరుగుతున్నాయి. మిగితా రాష్ట్రాల్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. మరణాలు కూడా దాదాపు సున్నాకు పడిపోయాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్తగా మరణాలు నమోదు కాకపోవడం గమనార్హం.
20 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్..
ఆదివారం 106 కరోనా మరణాలు సంభవించినప్పటికీ.. వీటిలో 87 శాతం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడులలోనే కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా నిన్న కరోనా మరణాలు సంభవించలేదు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్తగా మరణాలు సంభవించకపోవడం శుభసూచకమనే చెప్పాలి. ఏపీ, తెలంగాణ, యూపీ, రాజస్థాన్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, అసోం, మణిపూర్, సిక్కిం, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, లక్షద్వీప్, మేఘాలయ, లడఖ్, అండమాన్ నికోబార్ దీవులు, ఉత్తరాఖండ్, దద్రానగర్ హవేలీ డామన్ డయ్యూలలో కొత్తగా కరోనా మరణాలు నమోదు కాలేదని కేంద్రం తెలిపింది.
87శాతం మరణాలు ఐదు రాష్ట్రాల్లోనే..
గత 24 గంటల్లో 106 మరణాలు నమోదైనప్పటికీ వాటిలో 87 శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కొత్త మరణాల్లో మహారాష్ట్రలో 62, కేరళలో 15, పంజాబ్ 7, కర్ణాటక 5, తమిళనాడు 3 చొప్పున నమోదయ్యాయి. కాగా, ఆదివారం ఒక్కరోజే 15,510 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, వాటిలో 87.25 శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో 8293, కేరళలో 3254, పంజాబ్ లో 579, కర్ణాటకలో 521, తమిళనాడులో 479, గుజరాత్లో 407 కొత్త కరోనా కేసులు పెరగాయి.
ఆ ఐదు రాష్ట్రాల్లోనే 84 శాతం యాక్టివ్ కేసులు
దేశంలో ప్రస్తుతం 1,68,627(1.52శాతం) యాక్టివ్ కేసులున్నాయి. వీటిలో ఐదు రాష్ట్రాల్లోనే 84 శాతం యాక్టివ్ ఉన్నాయి. మహారాష్ట్రలో 46.39శాతం, కేరళలో 29.49 శాతం, కర్ణాటకలో 3.45 శాతం, పంజాబ్లో 2.75శాతం, తమిళనాడులో 2.39శాతం చొప్పున ఉంది. కాగా, అత్యధికంగా కేరళ, మహారాష్ట్రలో 10వేలకుపైగా యాక్టివ్ కేసులుండగా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేకపోవడం గమనార్హం. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జోరుగా సాగుతోంది. మార్చి 1 నుంచి రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది.