ఏపీతోపాటు 18 రాష్ట్రాల్లో 24గంటల్లో మరణాల్లేవ్: వ్యాక్సిన్ రెండో డోసు 2లక్షలు దాటాయి
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించకపోవడం గమనార్హం. ఈ మేరకు వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. రోజు రోజుకు కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుండటం సానుకూలాంశమని తెలిపింది.
ఏపీతోపాటు 18 రాష్ట్రాల్లో మరణాల్లేవ్
గడిచిన 24 గంటల్లో దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా చోటు చేసుకోలేదు. వీటిలో ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, పుదుచ్చేరి, హిమాచల్ప్రదేశ్, లక్షద్వీప్, మణిపూర్, లడఖ్, అస్సాం, అండమాన్ నికోబార్ దీవులు, సిక్కిం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా-నగర్ హవేలి, డామన్-డయ్యూ ఉన్నాయని తెలిపింది.
వ్యాక్సిన్ రెండో 2లక్షలు దాటాయి..
ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ విషయానికొస్తే.. బుధవారం ఉదయం 8 గంటల వరకు దేశ వ్యాప్తంగా టీకా తీసుకున్నవారి సంఖ్య 90 లక్షల మార్కు దాటిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. వారిలో 61 లక్షల మంది ఆరోగ్య సిబ్బంది తొలి డోసు తీసుకోగా, రెండో డోసు పూర్తి చేసుకున్నవారిలో 2.76 లక్షల మంది ఉన్నారు.
28 రోజుల తర్వాతే రెండో డోసు
టీకా కారణంగా విషమ పరిస్థితులు తలెత్తిన కేసులు ఇప్పటి వరకు ఒక్కటి కూడా నమోదు కాలేదని తెలిపింది. కాగా, గత 24 గంటల్లో దేశ వ్యాపత్ంగా 2.76 లక్షల మందికి టీకాలు వేయగా, అందులో 1.60 లక్షలు తొలి డోసు వేయించుకున్నవారు కాగా, 1.16 లక్షల మంది రెండో డోసు వేయించుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది. కేంద్ర ఆరోగ్యశాఖ ఫిబ్రవరి 13 నుంచి కరోనా టీకా రెండో డోసు ప్రక్రియ ప్రారంభించింది. తొలి డోసు తీసుకుని 28 రోజులు పూర్తి చేసుకున్నవారికి రెండో డోసు వేస్తున్నారు.
లక్షా 36వేలకు యాక్టివ్ కేసులు
కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,610 కరోనా కేసులు నమోదు కాగా, దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,37,320కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 11,833 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1,06,44,858కి చేరింది. గత 24 గంటల్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1,55,913కి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,36,549 యాక్టివ్ కేసులున్నాయి.