చైనాకు ఊపిరిసలపనివ్వకుండా: టన్నుల్లో పేరుకుపోతున్న చైనీస్ వస్తువులు: నో కస్టమ్స్ క్లియరెన్స్
న్యూఢిల్లీ: భారత జవాన్లపై ప్రాణాంతక దాడికి పాల్పడిన చైనాకు చెక్ పెట్టేదిశగా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోంది. చైనా నుంచి దిగుమతి చేసుకుంటోన్న వస్తువులకు క్లియరెన్స్ ఇవ్వట్లేదు. ఫలితంగా దేశంలోని పలు విమానాశ్రయాల్లో చైనా వస్తువులు పేరుకుపోతున్నాయి. కోల్కత, చెన్నై సహా దేశంలోని కొన్ని ప్రధాన విమానాశ్రయాల్లో చైనా వస్తువులు కార్గో కార్యాలయాల్లోనే నిలిచిపోయాయి.
గాల్వన్ వ్యాలీలో కిందటి వారం చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనిక బలగాలు భారత జవాన్లపై ప్రాణాంతక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. రెండు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న ఈ ఘర్షణల్లో 65 మందికి పైగా జవాన్లు మరణించారు. భారత్ తరఫున 20 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన అనంతరం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరింపజేశారు.
సరిహద్దుల్లో పరిస్థితి అలా ఉంటే.. దేశ వ్యాప్తంగా చైనాపై వ్యతిరేకత భారీగా పెరిగింది. చైనా అంటే ఒంటికాలి మీద లేస్తున్నారు ప్రజలు. చైనాలో తయారైన వస్తువులను బహిష్కరించాలంటూ నినదిస్తున్నారు. ఇప్పటికే పలువురు తాము వినియోగిస్తోన్న చైనా వస్తువులను ధ్వంసం చేశారు. టీవీలను సైతం పగులగొట్టారు. ఇకపై చైనా వస్తువులను కొనుగోలు చేయబోమని ప్రతిజ్ఙ చేయడానికీ వెనుకాడట్లేదు.
రూ.4 వేల కోట్ల కుంభకోణంలో షాకింగ్ ట్విస్ట్: ఐఎఎస్ అధికారి ఆత్మహత్య: ఉరి వేసుకుని: అనుమానాలు
చైనా వస్తువులను బహిష్కరించడానికి ఇదే సరైన సమయమని కేంద్ర ప్రభుత్వం భావించినట్టు ఉంది. అందుకే- డ్రాగన్ కంట్రీ నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని రకాల వస్తువులకు అనుమతి ఇవ్వట్లేదు. ఈ దిశగా కస్టమ్స్ అధికారులకు అనధికారికంగా ఆదేశాలను జారీ చేశారని అంటున్నారు. ఫలితంగా కార్గో విమానాల ద్వారా ఎయిర్పోర్టులకు చేరుకున్న చైన వస్తువులకు కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వట్లేదు. ఫలితంగా అవి విమానాశ్రయాల్లోనే పడి ఉన్నాయి..పేరుకుపోతున్నాయి.
చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులకు అనుమతి ఇవ్వకూడదని అంటూ అంతర్గతంగా తమకు ఆదేశాలు అందాయని కోల్కత కార్గో మేనేజింగ్ కమిటీ సభ్యుడు, ఎయిర్ కార్గో ఏజెంట్ల అసోసియేషన్ ప్రతినిధి జైదీప్ రాహా తెలిపారు. ఓడరేవుల్లోనూ దీనికి సంబంధించిన ఉత్తర్వులను అమల్లోకి తీసుకుని రాబోతున్నట్లు సమాచారం అందిందని అన్నారు. 35 కోట్ల రూపాయల విలువ చేసే 40 టన్నుల చైనా వస్తువులు ప్రస్తుతం కోల్కత విమానాశ్రయంలో పేరుకునిపోయి ఉన్నాయని జైదీప్ చెప్పారు.
పెర్ఫ్యూమ్స్, గార్మెంట్స్, కొన్ని పరికరాలు, స్పేర్ పార్టులు, ఫార్మాసూటికల్స్ కెమికల్స్, ప్లాస్టిక్ వస్తువులు, టీ బ్యాగులను తయారు చేసే మిషన్లు వంటి సుమారు 250 రకాల పరికరాలు చైనా నుంచి దిగుమతి అయ్యాయని, వాటిని తెప్పించిన వ్యాపారులకు అందజేయడానికి కస్టమ్స్ అధికారులు అనుమతి ఇవ్వట్లేదని అన్నారు. తాము కస్టమ్స్ అధికారులను సంప్రదించగా.. ప్రధాన కార్యాయం నుంచి అందిన ఆదేశాల మేరకు క్లియరెన్స్ ఇవ్వట్లేదని సమాచారం ఇచ్చినట్లు జైదీప్ రాహా పేర్కొన్నారు.