ఎస్సీ, ఎస్టీ చట్టం: కేజీ బాలకృష్ణన్ తర్వాత లేని దళిత్ జడ్జి ప్రాతినిథ్యం
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ యాక్ట్పై సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు దళిత సంఘాలు ఏప్రిల్ 2న నిరసన చేపట్టాయి. ఇవి హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలో దేశవ్యాప్తంగా 9మంది మృతి చెందారు. దేశంలోని హయ్యర్ జుడిసియరీలో షెడ్యూల్ క్యాస్ట్లు ప్రాతినిథ్యం తక్కువగా ఉంది. అలాగే టాప్ కోర్టులో దళిత్ జడ్జి ఒక్కరు కూడా లేరు.
భగ్గుమన్న దళిత సంఘాలు: దేశవ్యాప్తంగా ఆందోళనలు, 9మంది మృతి
గత ఎనిమిదేళ్లుగా సుప్రీం కోర్టు జడ్జిగా ఎస్సీలు లేరు. దేశంలోని 24 హైకోర్టులలో ఒక్క దళిత్ జడ్జి కూడా చీఫ్ జస్టిస్గా లేరు.
కేజీ బాలకృష్ణన్ మాత్రమే సీజేఐగా పని చేసిన దళిత జడ్జి. ఆయన 11 మార్చి 2010లో రిటైర్ అయ్యారు. ఆయన రిటైర్మెంట్ తర్వాత ఏ దళిత న్యాయమూర్తి రాలేదు.
ఓ ఇంగ్లీష్ ఛానల్తో బాలకృష్ణన్ మాట్లాడుతూ.. హయ్యర్ జుడిషయరీలో రిజర్వేషన్లను తాను సపోర్ట్ చేయడం లేదని, కానీ అర్హతలు ఉన్నప్పటికీ దళిత్ జడ్జిలను అపాయింట్ చేయడంలో పక్షపాతం చూపవద్దన్నారు.
సుప్రీం కోర్టుకు దళిత్ జడ్జిలను రికమండ్ చేయాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు పలుమార్లు లా మినిస్ట్రీ లేఖలు రాసిందని అంటున్నారు. కానీ ఎలాంటి కదలిక లేదని చెబుతున్నారు. ప్రస్తుతం అత్యున్నత న్యాయ నియామకాలలో కుల రిజర్వేషన్లు లేవు.
అన్ని వర్గాల నుంచి ప్రాతినిథ్యం ఉండేలా స్వచ్చంధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సీజేఐకి లేఖ రాసిందని రవిశంకర ప్రసాద్ గత ఏడాది పార్లమెంటులో తెలిపారు. అయినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల డిమాండ్లకు మద్దతు లేదంటున్నారు.
కాగా, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని కీలక నిబంధనలను సుప్రీం మార్చడంపై సోమవారం ఆగ్రహ జ్వాలలు పెల్లుబికిన విషయం తెలిసిందే. న్యాయస్థానం తీర్పు చట్టాన్ని నీరుగార్చేలా ఉందంటూ పలు దళిత సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ హింసాత్మకంగా మారింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఒక్క మధ్యప్రదేశ్లోనే ఆరుగురు మృతిచెందారు. యూపీలో ఇద్దరు, రాజస్థాన్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
పంజాబ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో అల్లర్లు, ఆందోళనలు చోటుచేసుకున్నాయి. 100కు పైగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను దారి మళ్లించారు.
వందల మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు ప్రాంతాల్లో సెల్ ఫోన్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఎస్సీ, ఎస్టీల చట్టం కొన్ని సందర్భాల్లో దుర్వినియోగమవుతున్నట్లు భావించిన సుప్రీం ఈ కేసుల్లో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయకుండా, బెయిలుకు వీలు కల్పించేలా గత నెల 20న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ ఈ ఆర్డర్ పాస్ చేసిన సర్వోన్నత న్యాయస్థానంలో దళిత్ జడ్జిలు లేకపోవడం గమనార్హం.
కేంద్రం సమీక్షా పిటిషన్
దళిత సంఘాల ఆందోళనల నేపథ్యంలో సుప్రీం కోర్టులో కేంద్రం సమగ్ర సమీక్షా పిటిషన్ దాఖలు చేసింది. చట్టం నిబంధనల్లో మార్పులు తెస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేసింది. సుప్రీం తీర్పు రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ఉల్లంఘించేలా ఉందని ఆక్షేపించింది. సంబంధిత చట్టంలోని పాత నిబంధనలను యథాతథంగా కొనసాగనివ్వాలని కోరింది.
ఈ కేసులో సీనియర్ న్యాయవాదులు ప్రభుత్వం తరఫున పూర్తి సాధికారతతో వాదనలు వినిపిస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. మరోవైపు, గత నెల 20 నాటి తీర్పుపై స్టే ఇవ్వాలని, తీర్పును పునఃసమీక్షించాలని ఎస్సీ, ఎస్టీ సంస్థల అఖిల భారత సమాఖ్య పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలన్న సమాఖ్య విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర, న్యాయమూర్తులు జస్టిస్ ఎఎం ఖాన్ విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం నిరాకరించింది. తగిన సమయంలో విచారిస్తామని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు అన్యాయమని, స్టే విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది మనోజ్ గౌర్కెల్లా కోరారు. ఈ అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం విచారించాలన్నారు.