వలస కార్మికుల మరణాలపై సమాచారం లేదు: పార్లమెంటులో కేంద్రం
న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్డౌన్ సమయంలో చోటు చేసుకున్న వలస కార్మికుల మరణాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం తమ వద్ద లేదని సోమవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. ఆ సమాచారం లేనందున వారికి పరిహారం అందించే అవకాశం కూడా లేదని తెలిపింది.
కరోనాను ప్రారంభదశలోనే అరికట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం మార్చి 25 నుంచి సుమారు మూడు నెలలపాటు కఠినంగా లాక్డౌన్ను అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వలస కార్మికులు పనులు లేక తమ సొంత ప్రాంతాలకు వెళ్ళేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలువురు మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలారు.
ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో పలువురు సభ్యులు ఈ విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వలస కార్మికులకు ఎదురైన సమస్యలను అంచనా వేయడంలో కేంద్రం విఫలమైందంటూ విమర్శించారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి సంతోష్ కుామర్ గంగ్వార్ సమాధానం ఇచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఎన్జీవోలు, స్వయం సహాయక బృందాలు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు కరోనా కట్టడికి లాక్ డౌన్ సమయంలో కలిసి కట్టుగా పోరాటం చేశారని మంత్రి వ్యాఖ్యానించారు. కాగా, కేంద్రం గణాంకాల ప్రకారం.. 1.04 కోట్ల మంది వలస కార్మికులు లాక్ డౌన్ సమయంలో వారి సొంత రాష్ట్రాలకు తరలివెళ్లారు. కేంద్రం వీరిని తరలించేందుకు ప్రత్యేక రైళ్లు, రాష్ట్రాలు బస్సు సర్వీసులు నడిపాయి. అప్పటికే చాలా మంది కార్మికులు రోడ్డు మార్గం గుండా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలువురు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు.