ఆరోగ్య సేతు యాప్తో గోప్యతకు ఢోకాలేదు: హ్యాకర్ హెచ్చరికలపై కేంద్రం, ‘రాహుల్ ట్యాగ్’
న్యూఢిల్లీ: ఆరోగ్య సేతు యాప్ వాడకంపై ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టతనిచ్చింది. ఈ యాప్ వాడకం వల్ల ఏ విధమైన సమాచార ఉల్లంఘన జరగడం లేదని వెల్లడించింది. 90 మిలియన్ల భారతీయుల గోప్యత ప్రమాదంలో ఉందంటూ ఫ్రెంచ్ ఎథికల్ హ్యాకర్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు స్పందించింది.
ఏ ఒక్క వ్యక్తి గోప్యతకు ప్రమాదం లేదు..
ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన సమాచారం కూడా ప్రమాదం ఉందని ఈ ఎథికల్ హ్యాకర్ నిరూపించలేకపోయారని కేంద్రం తన ప్రకటనలో వెల్లడించించింది. దీనిపై ఎలియట్ ఆల్డర్సన్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతా నుంచి హ్యాకర్ తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. ఇక్కడ చూడటానికి ఏమీ లేదని మీరు చెప్తున్నారు, కానీ మేం చూస్తాం.. నేను మళ్లీ రేపు మీ ముందుకు వస్తానని ట్వీట్ చేశాడు.
ప్రమాదంలో ఉందంటూ హ్యాకర్.. రాహుల్ ట్యాగ్..
మంగళవారం పౌరుల సమాచార భద్రతకు సంబంధించి హ్యాకర్ వరుస ట్వీట్లుచేస్తూ ప్రభుత్వానికి హెచ్చరికలు చేశాడు. ‘హాయ్, ఆరోగ్య సేతు. మీ యాప్లో భద్రతాపరమైన లోపం ఉంది. 90 మిలియిన్ల భారతీయుల సమాచారం ప్రమాదం ఉంది. నన్ను ప్రైవేటుగా సంప్రదించగలరా? రాహుల్ గాంధీ చెప్పింది సరైంది' అని రాహుల్ గాంధీని కూడా ఆ హ్యాకర్ ట్యాగ్ చేయడం గమనార్హం.
ఓపిక తక్కువంటూ హ్యాకర్ హెచ్చరిక..
అంతేగాక, దీనికి సంబంధించిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ తనను సంప్రదించిందని తెలిపాడు. ప్రభుత్వం ఆ లోపాలను సరిదిద్దకపోతే వాటిని ప్రజల ముందు పెడతానని, తనకు ఓపిక కూడా తక్కువ అని హెచ్చరించాడు .
కరోనా సమాచారం కోసం ఆరోగ్య సేతు యాప్..
కాగా, కరోనాకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీపాటు కేంద్రమంత్రులు ఈ యాప్ను ప్రజలంతా డౌన్ లోడ్ చేసుకోవాలని, ఎంతో ఉపయోకరంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే లక్షల మంది భారతీయులు డౌన్ లోడ్ చేసుకున్నారు. అయితే, ఈ యాప్ పై రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేయడం, తాజాగా ఓ హ్యాకర్ హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాహల్ తోపాటు హ్యాకర్ వాదనలను కొట్టిపరేసిన కేంద్రం.. ఈ యాప్ ఎంతో భద్రమైనదని స్పష్టం చేసింది.