లోక్సభ: ఎన్ఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకోలేదన్న కేంద్రం
న్యూఢిల్లీ: భారత జాతీయ పౌరుల రిజిస్టర్(ఎన్ఆర్సీ)ని దేశ వ్యాప్తంగా అమలు చేసే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖిత పూర్వంగా దీనిపై సమాధానమిచ్చారు.
జాతీయస్థాయిలో ఎన్ఆర్సీ అమలు చేసే విషయంపై ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపలేదని, ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదని మంత్రి స్పస్టం చేశారు. ఇప్పటికే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ కూడా ఎన్ఆర్సీ కీలక ప్రకటన చేశారు.
ఎన్ఆర్సీని ఇప్పట్లో అమలు చేయబోమని, దానిపై ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలపై విపక్షాలు లోక్సభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బుల్లెట్ల కాల్పులు ఆపండంటూ ఆందోళనలు చేశారు.
ఢిల్లీలోని షాహీన్బాగ్ ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవల నిరసనలు చేస్తున్న ప్రాంతంలో వేర్వేరు ఘటనల్లో మూడుసార్లు కాల్పులకు పాల్పడ్డారు. గాల్లోలకి కాల్పులు జరపడం ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, మొదటి ఘటనలో నిందితులు నేరుగా విద్యార్థులపైనే కాల్పులు జరపడంతో ఓ విద్యార్థి గాయపడ్డాడు. కాగా, కాల్పులకు పాల్పడ్డ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా కూడా దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీఏఏను వ్యతిరేకిస్తూ కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు తమ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశారు. అలాగే తమ రాష్ట్రాల్లో సీఏఏను అమలు చేయబోమంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా అదే బాటలో ఉన్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామంటూ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పార్లమెంటు చేసిన చట్టాలను రాష్ట్రాలు అడ్డుకోలేవని న్యాయ నిపుణలు ఇప్పటికే స్పష్టం చేశారు.