ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాతే డిగ్రీ పట్టా: సుప్రీంకోర్టు స్పష్టీకరణ
కరోనా వైరస్ నేపథ్యంలో డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు చేయాలనే పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే పట్టా ఇవ్వాలని వర్సిటీలు, రాష్ట్ర ప్రభుత్వాలకు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. యూజీపీ మార్గదర్శకాల మేరకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలని కోరింది. రాష్ట్రంలో ఏమైనా సమస్యలు ఉంటే యూజీసీని సంప్రదించి పరీక్ష తేదీలను మార్చుకోవాలని సూచించింది. చివరి ఏడాది పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.
వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలను వాయిదా వేయొచ్చని.. కానీ ఎగ్జామ్ రాయకుండా మాత్రం ఎవరినీ పాస్ చేయవద్దని స్పష్టంచేసింది. పరీక్షల నిర్వహణపై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ గైడ్లైన్స్ ప్రతి ఒక్కరూ పాటించాలని తేల్చిచెప్పింది. విద్యార్థులు ఐదు సెమిస్టర్లు పూర్తి చేశారని, వాటి ఆధారంగా తుది పరీక్షల ఫలితాలు ప్రకటించాలని పిటిషనర్లు కోరగా.. వారి వాదనలతో సుప్రీంకోర్టు విభేదించింది. పరీక్ష నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాలు/ వర్సిటీలకు స్పష్టం చేసింది.
Recommended Video
యూజీసీతో రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదించి పరీక్షల నిర్వహణ తేదీలను ఖరారు చేయవచ్చని పేర్కొంది. పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని యూజీసీ మార్గదర్శకాలు సరైనవని అభిప్రాయపడింది. యూజీసీ మార్గదర్శకాలను పాటించకుంటే విద్యార్థుల డిగ్రీలు ఆమోదయోగ్యం కావు అని ధర్మాసనం తెలిపింది. పరీక్షలు నిర్వహించాల్సిందేననే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా మద్దతు తెలిపాయి.