త్రిశంకు స్వర్గంలో ఏఏపీ ఎమ్మెల్యేలు: కోర్టు తీర్పు వరకు ఇలాగే
న్యూఢిల్లీ: శాసన సభ్యత్వాలను కోల్పోయిన 20 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. ఎన్నికల కమిషన్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇరవై మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా తేల్చారు. ఈ ఎమ్మెల్యేలు అనర్హత వేటు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఎమ్మెల్యేలపై అనర్హత వేటును నిలిపివేసేందుకు హైకోర్టు అంగీకరించలేదు. ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగబోతోంది. ఈ నెల 29న తదుపరి విచారణ జరుగుతుందని హైకోర్టు పేర్కొంది.
ఈ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ఉప ఎన్నికల ఏర్పాట్లను ఈ నెల 29వ తేదీ వరకు చేయరాదని కోర్టు ఆదేశించింది. వీరిని అనర్హులుగా చేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి రికార్డులను సమర్పించాలని ఈసీని అడిగింది. ఇత ప్రతివాదులు కూడా తమ వాదనలు సమర్పించాలని ఆదేశించింది.
కాగా, 20 ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమపై విధించిన అనర్హత వేటును రద్దు చేయాలంటూ ఆ ఎమ్మెల్యేలు కోర్టును వేడుకున్నారు. లాభదాయకమైన పదవుల్లో కొనసాగుతున్న ఇరవై మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇటీవల ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సిఫారసు చేసింది.
ఆ ప్రతిపాదన మేరకు రాష్ట్రపతి కూడా వేటు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏఏపీ ఎమ్మెల్యేలు వేసిన పిటీషన్పై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. తాజాగా, బుధవారం కోర్టు పైవిధంగా స్పందించింది.