ఎన్పీఆర్పై అమిత్ షా సంచలన ప్రకటన
వివాదాస్పద బిల్లులపై వెనక్కి తగ్గబోమంటూనే నిబంధనల సవరణకు మోదీ సర్కారు ముందుకొంచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), దేశవ్యాప్త ఎన్ఆర్సీపై పెద్ద ఎత్తున విమర్శలు, నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలకు ముందు చేపట్టే జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్)పైనా అనుమానాలు రేకెత్తడం.. పలు రాష్ట్రాలు ఎన్పీఆర్ ను చేపట్టబోమంటూ తీర్మానాలు చేసిన దరిమిలా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం రాజ్యసభలో సంచలన ప్రకటన చేశారు.
Recommended Video
2010నాటి ఎన్పీఆర్లో లేని విధంగా.. మోదీ సర్కార్ 2020 లెక్కల కోసం కొత్తగా చేసిన మార్పులను ఉపసంహరించుకుంటామని అమిత్ షా తెలిపారు. ప్రతిపక్ష పార్టీలతోపాటు మిత్ర పార్టీలు కూడా ఏ అంశాన్ని తప్పుపడుతున్నాయో.. ఆ 'డౌట్ఫుల్ సిటిజన్(సందేహాస్పద పౌరుడు)' లేదా 'డీ' అనే కేటగిరీ ఇకపై ఉండబోదని హోం మంత్రి స్పష్టం చేశారు. అంతేకాదు, ఎన్పీఆర్ విషయంలో ఎలాంటి పత్రాలు అవసరం లేదని, ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పాలా? వద్దా? అన్నది పూర్తిగా ఐచ్ఛికమని, ప్రజలకు ఇష్టముంటే చెప్పొచ్చు లేదంటే లేదని షా తెలిపారు.
సీఏఏతో ఎన్పీఆర్ ను అనుసంధానిస్తారా? అన్న కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబాల్ ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర హోం మంత్రి ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఎన్పీఆర్ పై ఎవరికి ఎలాంటి సందేహాలున్నా తీర్చడానికి హోం శాఖ సిద్ధంగా ఉందన్నారు. సీఏఏ విషయంలోనూ ముస్లింలు అనవసరంగా ఆందోళన చెందుతున్నారని, కొన్ని పార్టీలు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తూ సీఏఏపై భయాలు రేకెత్తిస్తున్నాయని షా మండిపడ్డారు. సీఏఏ పౌరసత్వం ఇచ్చేదేగానీ తొలగించేది కాదని స్పష్టం చేశారు.
అంతకుముందు ఢిల్లీ అల్లర్లపై ప్రభుత్వం తరఫున సమాధానం ఇస్తూ.. బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని, వాళ్లు ఏ మతానికి చెందినవారనేది చూడకుండా, చట్టప్రకాశం శిక్షలు అమలయ్యేలా చేస్తామని హోం మంత్రి చెప్పారు. ఢిల్లీ అల్లర్లపై ఇప్పటిదాకా 700 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని, ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నప్పటికీ, ఒక ఘటనకు సంబంధించి ఎక్కువ ఎఫ్ఐఆర్ లు నమోదు చేయరాదన్న నిబంధన మేరకు పోలీసులు వ్యవహరిస్తున్నారని షా తెలిపారు. ఢిల్లీ అల్లర్లపైనే బుధవారం లోక్ సభలో మాట్లాడిన ఆయన.. 36 గంటల్లోనే అల్లర్లు అదుపుచేశారంటూ ఢిల్లీ పోలీసులకు కితాబిచ్చిన సంగతి తెలిసిందే.