రన్నింగ్ ట్రైన్ ఎక్కడం కుదరదిక: ఎయిర్పోర్టుల్లా..సాఫిస్టికేటెడ్గా: రైల్వే స్టేషన్లలో ఎంట్రీ??
న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రత రైలు ప్రయాణాల్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టుబోతోంది. సినీ ఫక్కీలో.. చివరి నిమిషంలో రైల్వే స్టేషన్లోకి ఎంట్రీ ఇచ్చి.. అప్పుడే కదులుతున్న రైలును పరుగెత్తుకుంటూ ఎక్కాలనుకోవడం ఇక కుదిరే పని కాదు. చివరి నిమిషంలో రైల్వే స్టేషన్లలో అడుగు పెట్టే విధానానికి బ్రేక్ పడబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపై విమానాశ్రయాల తరహాలో ప్రయాణికులకు ప్రవేశం కల్పించే విధానంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Recommended Video
ధృవీకరించని అధికారులు..
ఈ వార్తలను రైల్వే మంత్రిత్వ శాఖ గానీ, రైల్వే బోర్డు అధికారులు గానీ ఇంకా ధృవీకరించలేదు. ప్రస్తుతం తమ దృష్టి లాక్డౌన్ పరిస్థితులను ఎదుర్కోవడంపైనే ఉందని, ఆ తరువాతే.. సంస్కరణల దిశగా మార్పులు చేసే దిశగా ఆలోచన చేస్తామని అంటున్నారు. రైల్వే స్టేషన్లకు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా పరిశుభ్రతను పాటించాల్సి ఉంటుందని, ఈ దిశగా కొన్ని మెరుగైన చర్యలను తీసుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. విమానాశ్రయాల తరహాలో ఉండాలా? లేక ఇదివరకు ఉన్న విధానాలనే కొనసాగించాలా? అనేది నిర్ణయిస్తామని చెబుతున్నారు.
రైళ్ల రాకపోకలు ఎలా..
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరస్థితుల్లో అందరి దృష్టీ రైల్వేపైనే నిలిచింది. దేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థగా ఉన్న రైల్వేలు ఏ స్థాయిలో క్రిక్కిరిసిపోతుంటాయనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేని విషయం. జనరల్ బోగీల్లో ప్రయాణికులు ఎలాంటి పరిస్థితుల మధ్య ప్రయాణం కొనసాగిస్తుంటారనేది తెలిసిన విషయమే. కాలు పెట్టడానికి కూడా స్థలం లేనంతగా కిటకిటలాడుతుంటాయి మన రైళ్లు.
రైళ్లల్లో సోషల్ డిస్టెన్సింగ్ సాధ్యమేనా?
కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి. రైళ్లల్లో సోషల్ డిస్టెన్సింగ్కు అవకాశం ఉందా? అనే ప్రశ్నకు అడ్డంగా తల ఊపాల్సి ఉంటుంది.. ఎవరికైనా. సోషల్ డిస్టెన్సింగ్ను పాటించడం వల్లే దేశాన్ని కరోనా రహితంగా మార్చవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోన్న వేళ.. రైళ్లల్లో ప్రయాణాలు ఎలా ఉండాలనే దిశగా రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డు అధికారులు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
విమానాశ్రయాల తరహాలో..
రైళ్లల్లో సోషల్ డిస్టెన్సింగ్ విధానాన్ని అనుసరించడం దాదాపు అసాధ్యమని, అందుకే- ప్రతి ప్రయాణికుడినీ క్షుణ్నంగా పరిశీలించిన తరువాతే రైలు ఎక్కనిచ్చే విధానానికి రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు తెర తీశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రయాణికులు విమానాశ్రయాలకు గంట నుంచి మూడు గంటలు ముందుగా రావాల్సి ఉంటుంది. విమానాశ్రయాల్లో ప్రయాణికుల ఎంట్రీ అత్యంత సాఫిస్టికేటెడ్గా ఉంటుంది. అలాంటి విధానాన్ని రైల్వే స్టేషన్లలోనూ అమలు చేయాల్సి ఉంటుందా? అనే దిశగా రైల్వే బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.