కోవిడ్-19 పేషెంట్ అంత్యక్రియలు.. వీడియో కాల్ ద్వారా చూసిన భార్య..
దేశ రాజధాని ఢిల్లీలోని నోయిడాలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం(మే 11) కరోనాతో 60 ఏళ్ల ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే మృతుడి అంత్యక్రియలకు స్థానిక అధికారులెవరూ సహకరించకపోవడంతో ఆసుపత్రి సిబ్బందే చివరి క్రతువులు పూర్తి చేశారు. మృతుడి భార్య కూడా కరోనా పేషెంట్ కావడంతో భర్త అంత్యక్రియలను ఆమె ఆసుపత్రి నుంచే వీడియో కాల్ ద్వారా వీక్షించింది. వీరి కుమార్తె లాక్ డౌన్ కారణంగా గుజరాత్లో చిక్కుకుపోయి అంత్యక్రియలకు రాలేకపోయింది. వారణాసిలోని బంధువులు కూడా లాక్ డౌన్ కారణంగా రాలేకపోతున్నామని సమాచారం అందించారు. అంత్యక్రియలకు సహకరించేందుకు స్థానికులు కూడా ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.
ఎవరూ పట్టించుకోకపోవడంతో..
కోవిడ్-19 పేషెంట్ అంత్యక్రియలు నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం నుంచి వారికి ఎలాంటి సహాయ సహకారాలు లభించలేదు. దీంతో అతను చికిత్స పొందిన ఆసుపత్రి సిబ్బందే నోయిడా-94 సెక్టారులోని శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారని పీటీఐ వెల్లడించింది. 'వాళ్ల కుమార్తె గుజరాత్లో చిక్కుకుపోయింది కాబట్టి అత్యవసరంగా ఇక్కడికి రాలేదని అర్థం చేసుకోగలం. అలాగే వారణాసిలో ఉన్న బంధువులు కూడా అంత త్వరగా రాలేరు. అయితే అధికార యంత్రాంగం నుంచి కూడా సహాయ సహకారాలు అందకపోవడం తమను షాక్కి గురిచేసిందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.
అధికార యంత్రాంగం ఏమంటున్నారు..
ఈ ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్ సుహాస్ ఎల్వై,చీఫ్ మెడికల్ ఆఫీసర్లను పీటీఐ సంప్రదించగా.. వారి వైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే మంగళవారం సాయంత్రం జరిగిన మృతుడి అంత్యక్రియలకు సంబంధించి డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ఓ ఫోటోలో మెజిస్ట్రేట్ ఉండటం కనిపించింది. అయితే ఈ ఘటనపై అధికారుల వాదన భిన్నంగా ఉంది. ప్రోటోకాల్ ప్రకారం ఎవరైనా వ్యక్తి చనిపోతే.. ఆ మృతదేహంతో ఎవరికి సంబంధం లేదని తేలితేనే అధికార యంత్రాంగం అంత్యక్రియలు నిర్వహిస్తుందన్నారు.ఈ ప్రక్రియకు 72 గంటల సమయం పడుతుందన్నారు.
వీడియో కాల్ ద్వారా చూసిన భార్య
కరోనాతో మృతి చెందిన ఆ వ్యక్తి సోమవారం దగ్గు సమస్యతో ఆసుపత్రిలో చేరాడు. అయితే పరిస్థితి విషమించడంతో అతన్ని ఐసీయూకి మార్చారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటిలేటర్పై ఉంచారు. అయితే అదే రోజు రాత్రి 9గంటల సమయంలో గుండెపోటు రావడంతో అతను మృతి చెందాడు. మరుసటి రోజు సాయంత్రం అతని అంత్యక్రియలు నిర్వహించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని భార్య వీడియో కాల్ ద్వారా ఆ దృశ్యాలను వీక్షించారు.