బ్రెగ్జిట్పై చర్చిస్తే ఊరుకుంటారా?: ఈయూ పార్లమెంట్ తీర్మానంపై వెంకయ్య ఆగ్రహం, హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశాలకు జోక్యం చేసుకునే హక్కు ఎంతమాత్రం లేదని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తేల్చి చెప్పారు. ఐరోపా సమాఖ్య(యూరోపియన్ యూనియన్-ఈయూ) పార్లమెంటులో ఇటీవల భారత్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా తీర్మానాన్ని తీసుకొచ్చి విషయాన్ని శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ రాజ్యసభలో ప్రస్తావించారు.
భారతదేశం తన అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం తలదూర్చినా సహించదు అనే తీర్మానాన్ని ప్రవేశపెడతామని సూచించారు. కాగా, ఈయూ పార్లమెంట్ అంశంపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నేను స్పష్టంగా ఒకటే చెబుతున్నా.. భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు విదేశాలకు లేదు. ఇది నేను రాజ్యసభ ఛైర్మన్ గానే కాదు ఉపరాష్ట్రపతిగా కూడా చెబుతున్నా'అని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
'ఇక్కడి విషయాలేవైనా భారత పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకునే అధికారం ఉంది' అని వెంకయ్యనాయుడు తెలిపారు. అంతేగాక, భారత పార్లమెంటులో బ్రెగ్జిట్ గురించి చర్చిస్తే వారు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. విదేశాలు తమ దేశాల్లో జరుగుతున్న విషయాలు గురించి పట్టించుకుంటే మంచిదని హెచ్చరించారు.
ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలోనూ వెంకయ్యనాయుడు భారత్ అంతర్గత విషయాల్లో బయటి వ్యక్తులు జోక్యం తగదని హెచ్చరించారు. కాగా, భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా యూరోపియన్ పార్లమెంటులో ఐదు విభిన్న తీర్మానాలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ తీర్మానాలపై గత బుధవారం చర్చ జరిగింది. అయితే, గత గురువారం ఈ తీర్మానాలపై ఓటింగ్ జరుగుతుందని అంతా భావించినప్పటికీ అది మార్చి 2న జరిగే సమావేశాలకు వాయిదా పడింది. సీఏఏ వివక్ష పూరితంగా ఉందంటూ యూరోపియన్ పార్లమెంటు పర్కొంది.